ఆర్మూర్/నందిపేట్/నందిపేట్ రూరల్, జూలై 22 : ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి నియోజకవర్గంలోని ఆర్మూర్, నందిపేట్, మాక్లూర్, నందిపేట్ రూరల్ మండలాల్లో ప్రస్తుత పరిస్థితి గురించి తహసీల్దార్లు, ఎస్సైలు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అడిగి వివరాలను తెలుసుకున్నారు.నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాల ని తహసీల్దార్లకు, ఎస్సైలకు, ఇరిగేషన్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. జోర్పూర్ వాగు ప్రమాదస్థాయిలో ప్రవహించే అవకాశం ఉందని, ప్రజలను వాగు దాటకుండా అప్రమత్తం చేయాలని తహసీల్దార్లకు సూచించారు. ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడిన వారిలో ఆర్మూర్ తహసీల్దార్ లక్ష్మణ్, నందిపేట్, మాక్లూర్ తహసీల్దార్లు, ఆర్మూర్ ఏసీపీ రఘు, ఎస్హెచ్వో సైదేశ్వర్, ఎస్సైలు యాదగిరిగౌడ్, శ్రీకాంత్, రాజారెడ్డి, శోభన్బాబు, మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత, వైస్ చైర్మన్ షేక్ మున్నా, ఎంపీపీలు నర్సయ్య, సంతోష్రెడ్డి, ప్రభాకర్, జడ్పీటీసీలు సంతోష్, యమున, సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు.