భీమ్గల్/మోర్తాడ్/కోటగిరి/ఇందల్వాయి/నందిపేట్/ఆర్మూర్ (నందిపేట్), ఏప్రిల్ 16: కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా ఆంక్షలు విధించుకుంటున్నారు. ఈ మేరకు శనివారం నుంచి లాక్డౌన్ పాటించేందుకు శుక్రవారం సమావేశాలు నిర్వహించుకొని తీర్మానాలు చేశారు. భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్లో లాక్డౌన్ అమలుచేస్తున్నట్లు వీడీసీ అధ్యక్షుడు మోర్తాడ్ లింబాద్రి తెలిపారు. ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరిచి ఉంచాలని, ప్రజలందరూ కొవిడ్ నిబంధనలను పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని కోరారు.
మోర్తాడ్ మండలంలోని దొన్కల్, మోర్తాడ్ గ్రామాల్లోనూ స్వచ్ఛంద లాక్డౌన్కు తీర్మానం చేశారు. సర్పంచులు భోగ ధరణి, కత్తి లావణ్య ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. మోర్తాడ్లో కూరగాయల మార్కెట్ను మండపం వద్దకు మార్చాలని, దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. మాస్కు ధరించనివారికి సరుకులు ఇస్తే రూ.2వేలు జరిమానా విధించాలని నిర్ణయించారు. ఆదివారం నిర్వహించే అంగడిని రెండువారాల పాటు రద్దుచేశారు. ఏప్రిల్ 30 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తీర్మానించారు. దొన్కల్లో దుకాణాలు ఉదయం 6 నుంచి 10గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉండనున్నాయి.
కోటగిరిలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయని సర్పంచ్ పత్తి లక్ష్మణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యాహ్నం రెండు తర్వాత.. అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటికి రావొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు.
ఇందల్వాయి మండలం గన్నారంలో స్వచ్ఛంద లాక్డౌన్ను పాటించాలని పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. కిరాణా దుకాణాలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు తెరిచి ఉంచాలని, చాయ్ హోటళ్లను నెలరోజులపాటు మూసివేయాలని సభ్యులు తీర్మానించారు. వారాంతపు సంత నాలుగు వారాలు రద్దు చేశారు. మాస్కు లేకుండా తిరిగితే ఫైన్, నిబంధనలు ఉల్లంఘించే దుకాణాలకు రూ.5వేల జరిమానా విధించాలని నిర్ణయం తీసుకునారు.
స్వచ్ఛంద బంద్కు వ్యాపారుల నిర్ణయం..
కరోనా కట్టడిలో భాగంగా నందిపేట్లో వ్యాపారులు దుకాణాలను ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకే మూసివేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వ్యాపారులతో నందిగుడి ఆవరణలో అధికారులు సమావేశం ఏర్పాటుచేసి కరోనా తీవ్రతను తగ్గించేందుకు చర్చించారు. సమావేశంలో తహసీల్దార్ అనిల్కుమార్, ఎంపీడీవో నాగవర్ధన్, ఎస్సై శోభన్బాబు, టీఆర్ఎస్ నాయకుడు ఎస్జీ తిరుపతి, వర్తక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆర్మూర్లో నాలుగు కంటైన్మెంట్ జోన్లు..
ఆర్మూర్ పట్టణంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు నాలుగు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. రామ్నగర్, హౌసింగ్ బోర్డ్, టీచర్స్ కాలనీ, రాజారాంనగర్ కాలనీల్లో రెండుమూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో కాలనీల వద్ద రోడ్లకు ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. కంటైన్మెంట్ జోన్లకు ఇతరులు వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత తెలిపారు. ఆయా కాలనీవాసులు సైతం సహకరించాలని మున్సిపల్ అధికారులు కోరారు.
ఇవీ కూడా చదవండీ…
అలుగు పారిన హల్దీవాగు ప్రాజెక్టు