ఇందూరు, జూలై 20 : పల్లెప్రకృతి వనాలు గ్రామపంచాయతీలకు కొత్త రూపునిచ్చాయని, వాటిని మోడల్గా తీసుకుని ప్రతి మండలంలో పది ఎకరాల విస్తీర్ణంలో బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ఆయన మాట్లాడారు. బృహత్ పల్లెప్రకృతి వనాల్లో బయోఫినిష్, వాకింగ్ ట్రాక్ తయారుచేయాలని, 30 గుంటల్లో ఒక చిల్డ్రన్పార్క్ ఏర్పాటు చేయాలని, మిగతా 7 ఎకరాల్లో 27,700 మొక్కలు నాటాలని, ప్రతి మీటర్కూ ఒక మొక్క నాటేలా రేపటి నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని పనులను ప్రారంభించాలని ఆదేశించారు. బృహత్ పల్లెప్రకృతి వనాల్లో 24వ తేదీ నుంచి మొక్కలు నాటడం ప్రారంభించాలని, వారంలో మొక్కలు నాటడం పూర్తి కావాలన్నారు. గోరింటాకు, వెదురు, ఉసిరి, చింత, రావి తదితర మొక్కలను నాటాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న డీఎల్పీవో, ఎంపీడీవోలు, పీఆర్, ఆర్ అండ్బీ ఏఈలు, పంచాయతీ సెక్రటరీలు శానిటేషన్పై కూడా దృష్టి సారించాలని, ప్రతి గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను పక్కాగా చేపట్టాలని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, చెత్తను కంపోస్ట్ షెడ్లకు తరలించాలని ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీపీవో జయసుధ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
హరితహారానికి స్థలాలను గుర్తించాలి
హరితహారం కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల సహాయ ఇంజినీర్లు వారి పరిధిలోని రహదారులలో ఖాళీ స్థలాలను గుర్తించి అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. సెల్ కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ఆయన పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల ఏఈలతో మాట్లాడారు. గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో రోడ్లకిరువైపులా మొక్కలను నాటేందుకు హద్దులను గుర్తించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులతో సమన్వయం చేసుకుని నివేదికలను సిద్ధం చేయాలని, ఏదైనా తేడా వస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సెల్ కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.