ఆర్మూర్, సెప్టెంబర్ 21 : జిల్లాలోని ఆర్మూర్ నియోజక వర్గంలో బీజేపీ నేతల మధ్య అగాధం చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నది. నియోజకవర్గంలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీ గత ఎన్నికల్లో కొద్దోగొప్పో ఓట్లు సాధించడంతో నియోజకవర్గంలో పార్టీ కోలుకుంటున్నట్లు కనిపించినా.. ప్రస్తుతం నాయకుల మధ్య విభేదాలు మాత్రం తారాస్థాయికి చేరినట్లు సమాచారం. పార్టీలో ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న అల్జాపూర్ శ్రీనివాస్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ పెద్దల ఆదేశాల మేరకు బోధన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ బోధన్ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. కానీ ఈ యేడాది ప్రారంభంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ బోధన్ నియోజకవర్గంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకుడిని అల్జాపూర్ శ్రీనివాస్కు సమాచారం ఇవ్వకుండా బీజేపీలో చేర్చుకున్నారు. దీంతో ఎంపీ అర్వింద్, అల్జాపూర్ శ్రీనివాస్ల మధ్య దూరం పెరిగిందని పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఇటీవల బీజేపీ ఆధ్వర్యంలో నిర్మల్లో జరిగిన ఓ సభకు ఆర్మూర్ బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్కుమార్రెడ్డి ఓ పత్రికలో ప్రచారం కోసం వేసిన ప్రకటన సైతం నాయకుల విభేదాలను ప్రస్ఫుటం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పైగా ఎంపీ ధర్మపురి అర్వింద్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మూర్ అసెంబ్లీ నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఇదిలా ఉండగా ఆర్మూర్ నుంచి టిక్కెట్పై ఆశలు పెట్టుకున్న వినయ్కుమార్రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని నాయకులు అనుకుంటున్నారు. ప్రస్తుతం బీజేపీలోని నాయకులందరూ ఆర్మూర్ అసెంబ్లీపైనే దృష్టి సారించడంతో వినయ్కుమార్రెడ్డికి ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడిందని నాయకులు చెబుతున్నారు.
అల్జాపూర్ గురి మళ్లీ ఆర్మూర్ వైపే…
గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన వినయ్కుమార్రెడ్డి అపజయాన్ని మూటగట్టుకున్నారు. అయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ ప్రస్తుతం జిల్లా ఎంపీ అర్వింద్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మూర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం సాగుతున్నది. దీంతో పాటు అల్జాపూర్ శ్రీనివాస్ సైతం ఆర్మూర్ నుంచే పోటీ చేస్తున్నట్లు వినబడుతున్నది. ఇటీవల నిర్మల్లో జరిగిన సభకు హైదరాబాద్ తదితర జిల్లాల నుంచి ఆర్మూర్ మీదుగా తరలిన బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్నంతటికీ అల్జాపూర్ తన విద్యా సంస్థ అయిన క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. ఇదే సభకు ఎంపీ అర్విం ద్ ఆర్మూర్ మీదుగా వెళ్లినా క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలలో బస చేసిన రాష్ట్ర నాయకుల వద్దకు వెళ్లలేదు. దీంతో ఎంపీ అర్వింద్, అల్జాపూర్ శ్రీనివాస్ మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నట్లు పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిత్వానికి ఎంపీ అర్వింద్, అల్జాపూర్ శ్రీనివాస్, ప్రొద్దుటూరి వినయ్కుమార్రెడ్డిల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు కనబడుతున్నది. బీజేపీ నేతల మధ్య పెరిగిన అగాధం కార్యకర్తల ను అయోమ యంలో పడేస్తున్నది. గ్రూపుల లొల్లి తీవ్ర స్థాయికి చేరడంతో కార్యకర్తలు పార్టీని వీడుతున్నారు. పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఎవరి బాటలో నడవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.