బిచ్కుంద, జూలై 17 : మండలంలో వానకాలంలో 13 వేల ఎకరాల్లో రైతులు సోయా పంటను సాగుచేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని వివిధ గ్రామాల్లో సాగుచేస్తున్న సుమారు రెండు వేల ఎకరాల సోయా పంట నీట మునిగింది. మొలక దశలో ఉండగా వర్షాలు కురవడంతో మొక్క దశలోనే సోయా పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో మెట్ట భూములు ఉన్నందున రైతులు సోయా పంటను అధికంగా సాగుచేస్తారు. రైతులు అధిక ధరలు పెట్టి దుకాణాల్లో సోయా విత్తనాలను కొనుగోలు చేశారు. ఎకరం చేనులో సోయా పంట సాగు చేసేందుకు సుమారు రూ. 6 వేల పెట్టుబడి పెట్టినట్లు రైతులు తెలిపారు. మృగశిర కార్తె ప్రారంభంలోనే వర్షాలు కురవడంతో రైతులు పంటపొలాల్లో సోయా విత్తనాలను యంత్రాల ద్వారా విత్తుకున్నారు. మరుసటి రోజే వర్షాలు కురవడంతో విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో రైతులు కొంత అధైర్యపడినా మళ్లీ విత్తనాలను కొనుగోలు చేసి రెండోసారి విత్తుకున్నారు. రెండోసారి వేసిన సోయా పంట మొలక దశలో ఉండగానే మూడు నాలుగు రోజుల పాటు భారీవర్షాలు కురవడంతో పంట మునిగిపోయింది. మహారాష్ట్ర నుంచి వ్యాపారులు సోయా పంటను కొనుగోలు చేయడానికి మండలానికి వస్తారు. దీంతో ఇక్కడి ప్రాంత రైతులు సోయాపంటను పెద్ద మొత్తంలో సాగు చేస్తారు. నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
క్షేత్రస్థాయిలో సర్వే చేపడుతున్నాం
ఇటీవల కురిసిన భారీవర్షాలకు మండలంలో సుమారు రెండు వేల ఎకరాల్లో సోయా పంట నీట మునిగింది. క్షేత్రస్థాయిలో సర్వే చేపడుతున్నాం. మొలక దశలోనే భారీ వర్షాలు కురవడంతో రైతులు నష్టపోయారు. నీట మునిగిన పంటల వివరాలను నమోదు చేసుకుంటున్నాం. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం.