నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 23: జిల్లావ్యాప్తంగా నాలుగు రోజులుగా వర్షం కురుస్తున్నది. వాగులు, వంకలు, ఒర్రెలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెక్డ్యాములు పొంగిపొర్లుతున్నాయి. చేపలు ఎదురెక్కుతున్నాయి. దాదాపు అన్ని చెరువుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో నిండుకుండల్లా మారాయి. ఎడపల్లి శివారులోని పెద్దవాగు, అంబం(వై) శివారులోని వాగుల్లో, చెక్డ్యామ్ పైనుంచి నీరు పారుతున్నది. బాపూనగర్ వాగులో అలీసాగర్ చెరువు నుంచి చేపలు ఎదురెక్కాయి. పలు గ్రామాల్లో ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. నవీపేట మండలంలో వివిధ గ్రామాల్లో 200 ఎకరాలు నీట మునిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు. జన్నేపల్లి వాగు ఉధృతంగా పారుతున్నది. చేపలు ఎదురు ఎక్కడంతో ఆయా గ్రామాల రైతులు, యువకులు చేపలు పట్టేందుకు పోటీపడ్డారు. మండలంలో తొమ్మిది ఇండ్లు కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. రెంజల్ మండలం కందకుర్తి వద్ద త్రివేణి సంగమక్షేత్రం వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నది. రెంజల్ మండలంలో 81.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. నీలా క్యాంప్ ప్రధాన రోడ్డుపై భారీ వృక్షం నేలకొరిగింది.
కురిసిన వర్షాలకు ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులైన కుటుంబాలకు అధికారులు తాత్కాలిక వసతిని ఏర్పాటుచేశారు. బోధన్ మండలంలోని లంగ్డా పూర్ వంతెన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుంగింది. దీంతో అధికారులు బోధన్ -పెగడాపల్లి రాకపోకలను రద్దు చేసినట్లు బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ తెలిపారు. మాక్లూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. పంట నష్టం వివరాలను అధికారులు సేకరించారు. 118.4మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా 19 ఇండ్లు పాక్షికంగా ధ్వంసం అయినట్లు అధికారులు తెలిపారు. నందిపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల చుట్టూ నీళ్లు చేరాయి. నందిపేట సమీపంలోని జోర్పూర్ వాగు వద్ద నీటి ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్డును అధికారులు పరిశీలించారు. ఆర్మూర్ మున్సిపల్, మండలంలోని అన్ని గ్రామాల్లో మూడు రోజులుగా జోరుగా వాన కురుస్తోంది. దేగాం గ్రామంలో భారీ వర్షానికి చేపలు ఎదురెక్కి పంట పొలాల్లోకి రావడంతో యువకులు చేపలు పట్టారు. నీట మునిగిన పంటను, కూలిపోయిన ఇండ్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు.
ఏర్గట్ల మండలంలోని ఎనిమిది గ్రామా ల్లో నీటమునిగిన పంటలను జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ పరిశీలించారు. పలు గ్రామాల్లో కూలిన ఇండ్లను ఆర్ఐ సదానంద్ పరిశీలించారు. కమ్మర్పల్లిలో కురిసిన భారీ వర్షంతో పంట పొలాల వద్ద నిలిపిన ఓ ట్రాక్టర్ నీట మునిగింది. మోర్తాడ్లో 124 మి.మీల వర్షపాతం నమోదైంది. కమ్మర్పల్లి-వడ్యాట్, వడ్యాట్-దోన్పాల్ మధ్య కోతకు గురైన రోడ్లను అధికారులు పరిశీలించారు. ధర్పల్లి మండలంలోని మైలారం వాగు నిండుగా ప్రవహిస్తున్నది. చెరువు మత్తడి దుంకుతున్నది. మండలంలోని దుబ్బాక, మైలారం చెరువులను తహసీల్దార్ జయంత్రెడ్డి, ఇరిగేషన్ ఏఈతో కలిసి పరిశీలించారు. ఇందల్వాయి నుంచి ఇందల్వాయి తండాకు వెళ్లే దారిలో చిన్నవాగు లోలెవల్ వంతెన, రోడ్డు తెగిపోవడంతో తహసీల్దార్ రమేశ్ పరిశీలించారు.
నిజామాబాద్ మండలంలోని మల్కాపూర్ తండా శివారులో ఉన్న మొగులాలి చెరువు అలుగు పారుతున్నది.
సిరికొండ మండలంలోని న్యావనంది చెరువు 20 ఏండ్ల తర్వాత అలుగు పారిందని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. గడ్కోల్లో కప్పల వాగుపై నిర్మించిన చెక్డ్యాం కోతకు గురయ్యింది. పలు గ్రామాల్లో వంద ఎకరాల్లో వరి పంట నష్టం జరిగిందని తహసీల్దార్ అనిల్ కుమార్ తెలిపారు. కాల్పోల్ గ్రామ చెరువు అలుగు పారుతున్నది. డిచ్పల్లి మండలంలోని బర్ధిపూర్ కోనం చెరువు, సుద్దులం ఊర చెరువు, ఘన్పూర్, దూస్గాం, మండల కేంద్రంలోని ఈదుల చెరువులోకి భారీగా వర్షపునీరు వచ్చి చేరుతున్నది. కాగా రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.