భీమ్గల్, సెప్టెంబర్ 21: గల్ఫ్ బాధితులను ఆదుకోవాలనే లక్ష్యంతోనే భీమ్గల్లో న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్) శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్య వహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. న్యాక్ శిక్షణతో యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నా రు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాలులో మంగళవారం న్యాక్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శిక్షణ తీసుకున్న వారికి ధ్రువపత్రాలు, కుట్టుమిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భీమ్గల్, మోర్తాడ్, కమ్మర్పల్లి ప్రాంతాల్లో వ్యవసాయం చేద్దామంటే సాగునీరులేక యువత ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి బాధపడేవారన్నారు. దీని పరిష్కారం కోసం చాలా ఏండ్లుగా ఆలోచించానని, ఆ ఆలోచనల నుంచి వచ్చిందే న్యాక్ నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు అని వివరించారు. ఈ ప్రాంతానికి మొదటగా నీటి సౌకర్యం కల్పిస్తే పంటలు బాగా పండి గల్ఫ్ దేశాల బాట పట్టరనే ఉద్దేశంతో వాగులపై చెక్డ్యాములు నిర్మించినట్లు చెప్పారు. ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా నైపుణ్య శిక్షణ పొందిన వారికి సహకారం అందిస్తున్నట్లు చెప్పా రు. మహిళలకు కూడా నైపుణ్యత శిక్షణ ఇవ్వాలని సూచించారు. కేటీఆర్ నాయకత్వంలో రాష్ర్టానికి ఎన్నో కొత్త కంపెనీలు వస్తున్నాయని, ప్రైవేట్ రంగంలో పది నుంచి పన్నెండు లక్షల ఉద్యోగాలను కల్పించినట్లు తెలిపారు. ప్యాకేజీ- 21 ద్వారా ఈప్రాంతానికి సాగునీరు తీసుకురావడానికి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సంవత్సరం ప్యాకేజీ -21 పైప్లైన్ ద్వారా పోచంపాడ్, బినోల నుంచి పంటలకు నీళ్లు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ, ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, వైస్ చైర్మన్ భగత్, సొసైటీ చైర్మన్ నర్సయ్య, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మొయిజ్, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ రమేశ్, న్యాక్ డైరెక్టర్ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, కౌన్సిలర్లు కన్నె ప్రేమలత, మూత లత, తుమ్మ భూదేవి, ఖైరున్నీసా బేగం, షమీం బేగం, సతీశ్గౌడ్, గంగాధర్, లింగయ్య, మల్లెల అనుపమ, న్యాక్ ప్రిన్సిపాల్ దిలీప్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.