కామారెడ్డి, అక్టోబర్ 12 :హరితహారంతో కామారెడ్డి కొత్త కలేక్టరేట్ హరితవనంగా మారింది. అందమైన పూలమొక్కలతో పాటు నీడనిచ్చే మొక్కలను నాటడంతో వివిధ పనుల నిమత్తం కార్యాలయానికి వచ్చే వారికి ఆహ్లాదం పంచుతున్నాయి. సమీకృత కలెక్టరేట్ను జూన్ 20వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. అప్పటి కలెక్టర్ శరత్ ప్రత్యేక చొరవ తీసుకొని భవనం ప్రారంభానికి ముందు నుంచే మొక్కల పెంపకంపై దృష్టి సారించారు. ఆవరణ అంతా పచ్చదనం పరుచుకునేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నిత్యం పర్యవేక్షించారు. ప్రధాన రోడ్డుతో పాటు కలెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలను నాటించారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం సత్ఫలితాలనిస్తున్నది. కలెక్టరేట్ ప్రాంగణంలో నాటిన మొక్కలను 24 ప్రభుత్వ శాఖల అధికారులకు అప్పగించారు. వారు నిత్యం సంరక్షిస్తుండడంతో అనతి కాలంలో కార్యాలయ ఆవరణ పచ్చందాలను సంతరించుకున్నది. కలెక్టరేట్ ప్రాంగణంతో పాటు ప్రధాన రోడ్డులో సుమారు 10 వేల మొక్కలను నాటించారు. ప్రతిరోజూ మొక్కలకు నీళ్లు పోయడం, ఎండిన మొక్కల స్ధానంలో కొత్తవి నాటుతున్నారు. పాత కలెక్టరేట్లోని ఎకరం స్థలంలో హరితహారంలో భాగంగా ఆడిట్ శాఖ ఆధ్వర్యంలో నాటించిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగాయి. కలెక్టరేట్ ప్రాంగంణంతో పాటు క్యాంపు కార్యాలయాల్లో పచ్చదనం పరుచుకున్నది. ప్రస్తుతం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సైతం మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టిసారించారు. వివిధ పనుల కోసం కార్యాలయాలకు వచ్చే వారు పచ్చని చెట్ల నీడన సేదతీరుతున్నారు. అందమైన పూలమొక్కల వద్ద ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.