ఖలీల్వాడి, జూలై 18 : సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నగరంలో ఆదివారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ప్రగతివైపు పరుగులు తీస్తున్నదని అన్నారు. ఆడబిడ్డకు పెళ్లి చేసి గౌరవంగా పంపించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబా రక్ పథకాలను అమలుచేస్తున్నారని అన్నారు. 203 మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు పనులు ప్రారంభం
46వ డివిజన్ పరిధిలోని పూలాంగ్ప్రాంతంలో బీటీ, సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. కార్యక్రమంలో మేయర్, నుడా చైర్మన్తోపాటు కార్పొరేటర్ అక్బర్ హుస్సేన్, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకులు నవీద్ ఇక్బాల్, మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.