బాన్సువాడ, సెప్టెంబర్ 21 : రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలకూ సమన్యాయం చేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. బాన్సువాడ పట్టణంలో రూ.20 లక్షలతో చేపట్టనున్న టీఎన్జీవోస్ భవన నిర్మాణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో ఉద్యోగుల శ్రమ ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అత్యంత కీలకమని, కలిసి పనిచేస్తే అన్ని సాధించవచ్చన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించారన్నారు. తాను వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసే కాలంలో 1600 ఏఈవో పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని ఏ రాష్ట్రంలో నూ లేవన్నారు. ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడానికి ఉద్యోగులు సహకారం అందించాలని కోరారు. టీఎన్జీవోస్ భవన నిర్మాణానికి మరో రూ.10 లక్ష లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఉద్యోగుల ఇబ్బందులను గుర్తెరిగిన ఉద్యమ నాయకుడిగా, వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో టీఎన్జీవోస్ పాత్ర ఎంతో ఉందన్నారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్మానించారు.
చిల్లర రాజకీయాలు మానుకోండి.. : పోచారం
ఇటీవల కాలంలో కొంతమంది చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, మాట్లాడే భాష హుం దా గా ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. టీఎన్జీవోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ జనాభాలో మన రాష్ట్రం 13వ స్థానం, భౌగోళికంగా 12వ స్థానంలో ఉండగా, కాంట్రిబ్యూషన్లో మాత్రం మొదటిస్థానంలో ఉందన్నారు. కొంతమంది నాయకులు మైకు దొరికిందంటే చాలు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని, ఇది సరికాదన్నారు. ఒకరికి సాయం అందిస్తే మంచి నాయకులు అవుతారన్నారు. లక్షలాది మందికి ప్రాతినిధ్యం వహించే నాయకులు లక్షణంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజోపయోగ పనులు చేపడితే పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యదర్శి ప్రతాప్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నారల వెంకట్ రెడ్డి, బాన్సువాడ అధ్యక్ష కార్యదర్శులు వెంకట్, అనిల్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.