రుద్రూర్, జూలై 23 : అ నుమానమే పెనుభూత మై.. భార్యతో పాటు కూ తురిని హతమార్చిన సం ఘటన రుద్రూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ మండలం పెద్దమావంది గ్రామానికి చెందిన మల్లీశ్వరికి (30) రుద్రూర్కు చెందిన బోజడి గంగారాంతో 15 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు రుత్విక (13) ఉంది. మల్లీశ్వరిపై గంగారాం అనుమానం పెంచుకున్నాడు. దీంతో చాలా రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. చాలాసార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి నచ్చజెప్పారు. ఈ నెల 21న కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగితే పెద్దలు సముదాయించారు. భార్యపై అనుమానం పెంచుకున్న గంగారాం శుక్రవారం ఉదయం 4గంటల ప్రాంతంలో భార్య,కూతురిని గొడ్డలితో నరికి చంపాడు.
తర్వాత నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. తానే హత్య చేశానని, గొడ్డలిని మంచం కింద దాచి ఇంటికి తాళం వేసుకుని వచ్చానని, వస్తే చూపిస్తానని పోలీసులకు తెలిపాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ రామారావు విచారణ చేపట్టారు. తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే హత్య చేసినట్లు గంగారాం తెలిపాడు. ఎప్పుడు పంచాయితీ పెట్టినా తన కూతురు భార్యవైపే మాట్లాడేదని, తనకు భోజనం సైతం పెట్టేది కాదని అందుకే హత్య చేసినట్లు గంగారాం తెలిపాడు. గంగారాం ఒక్కడే హత్య చేసి ఉండడని ఆయన అన్నకు కూడా ఇందులో హస్తం ఉన్నట్లు మల్లీశ్వరి బంధువులు ఆరోపించారు. హత్యలో ఇంకా ఎవరి ప్రమేయం ఉందనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ దవాఖానకు తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏసీపీ రామారావు తెలిపారు.