డిచ్పల్లి/ధర్పల్లి, జూలై 19: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాజెక్టు రామడుగు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోమవారం రామడుగు ప్రాజెక్టులో పడి మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన అబ్దుల్ ఖాదర్ (37) తన కూతురితోపాటు అన్న ఖయ్యూం కుమారులిద్దరిని వెంటపెట్టుకొని మేకలను మేపేందుకు ప్రాజెక్టు రామడుగు వద్దకు వెళ్లాడు. అబ్దుల్ ఖాదర్ ప్రాజెక్టు పక్కన మేకలు మేపుతుండగా ఖాదర్ అన్నకొడుకు మహ్మద్ ఫరాహత్ (14) స్నానం చేసేందుకు ప్రాజెక్టులోకి దిగాడు. ప్రాజెక్టులోనికి వెళ్తున్న క్రమంలో ఒకేసారి లోతులోకి జారిపడడంతో మునిగిపోయాడు. అక్కడే ఒడ్డుపై ఉన్న ఖయ్యూం చిన్న కొడుకు చిన్నాన్న అబ్దుల్ ఖాదర్కు సమాచారం ఇచ్చాడు. ఖాదర్ సైతం ప్రాజెక్టులోకి దిగాడు. అప్పటికే లోతులో ఉన్న ఫరాహత్కు ఈత రాకపోవడంతో లోనికి వెళ్లిన ఖాదర్ను గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరు నీటమునిగి మృత్యువాతపడ్డారు.
స్థానికులు విషయాన్ని డిచ్పల్లి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి ఇద్దరి శవాలను బయటికి తీయించారు. మృతుడు అబ్దుల్ ఖాదర్కు ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందడంతో రామడుగులో విషాదఛాయలు అలుముకున్నాయి. మటన్ షాప్ నడుపుకొంటున్న అబ్దుల్ ఖాదర్ మధ్యాహ్నం సమయంలో మేకలను మేపేందుకు ప్రాజెక్టు వద్దకు రావడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి ఎస్సై బి.ఆంజనేయులు చేరుకొని వివరాలను సేకరించారు.
కన్న కొడుకు,తమ్ముడు మృతితో విషాద ఛాయలు
కాయాకష్టం చేసుకుంటూ ఆనందంగా కాలం వెల్లదీస్తున్న ఆ ఉమ్మడి కుటుంబంలో విషాదం నిండింది. 20 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర నుంచి వచ్చిన అబ్దుల్ ఖయ్యూం, ఖాదర్ అనే ఇద్దరు అన్నదమ్ములు మండలంలోని ప్రాజెక్టు రామడుగు గ్రామంలో మటన్ షాపు నిర్వహిస్తున్నారు. ఖాదర్, ఖయ్యూం కుమారుడు ప్రాజెక్టులో పడి మృతి చెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇద్దరు అన్నదమ్ములు వారి పిల్లలందరితో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబంలో ఇద్దరి మృతితో గ్రామంలో అంతులేని విషాదం చోటు చేసుకున్నది. వైస్ ఎంపీపీ కల్లెడ నవీన్రెడ్డి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.