నిజామాబాద్, మార్చి 25, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రామాల్లో పేరుకుపోయిన నిర్లక్ష్యపు జబ్బును నామరూపాల్లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. ఏడాదిన్నర కాలం నుంచి పల్లె ప్రాంతాలే లక్ష్యంగా కార్యక్రమాలను అమలు పరుస్తు న్నది. ప్రతినెలా ఫైనాన్స్ కమిషన్ నిధులను సమయానికి మంజూరు చేస్తూనే వాటిని సరైన రీతిలో ఖర్చు చేసే వ్యవస్థను రూపొందించింది. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు, అభివృద్ధి పనులకు అంచనాలు వేసి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తారు. అన్ని విధాలా పల్లెలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పల్లెప్రగతి పనులు క్షేత్ర స్థాయిలో ఎలా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ను సర్కారు రూపొందించింది. ఇందులో పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులను భాగస్వాములుగా చేశారు. గ్రామాల్లో కార్యదర్శులు చేస్తున్న పనులను అధికారులు యాప్ ద్వారానే పర్యవేక్షించి పనులు సాఫీగా జరిగేలా కృషి చేస్తున్నారు.
కార్యదర్శి నుంచి కమిషనర్ దాకా…
గ్రామాల్లో కార్యదర్శులు నిత్యం ఏయే పనులు చేయాలన్న విషయాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్దేశిస్తుంది. డెయిలీ శానిటేషన్ యాప్ ను కార్యదర్శులు మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నారు. యాప్లో మొబైల్ నంబర్ నమోదు చేయగానే వచ్చే వన్ టైం పాస్వర్డ్ను ఎంటర్ చేస్తే అందుబాటులోకి వస్తుంది. వచ్చిన మెసేజ్ ప్రకారం కార్యదర్శులు పారిశుద్ధ్యం, తదితర పనులు చేయించి సంబంధిత ఫొటోలను యాప్లో అప్లోడ్ చేయాలి. సెలవు రోజున తప్ప మిగతా పని దినాల్లో నిత్యం ఉదయం 7 నుంచి రాత్రి 7గంటల వరకు యాప్ అందుటాబులో ఉంటుంది. ఇందులో రోజువారీ పనితో పాటు నెలవారీ నివేదికలను నమోదు చేయాల్సి ఉంటుంది. పల్లె ప్రగతి కార్యక్రమాలు, కాలువల్లో పూడికతీత, రోడ్లు శుభ్రం చేయడం, తాగునీటి సమస్యలు, అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల పరిసరాల్లో శుభ్రత, వీధి దీపాలు, పంచాయతీ పాలన, రికార్డుల నిర్వహణ, ఆదాయ వ్యయాలు, చెక్కులు జారీ, వేతనాలు ఇలా అన్ని పనులకు సంబంధించి ఫొటోలు, నివేదికలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ స్థాయి అధికారి వరకు లాగిన్ అయ్యే వెసులుబాటు ఉండడంతో ఉన్నతాధికారుల పరిశీలన ప్రతి క్షణం ఉంటుంది.
మెరుగైన ఫలితాలు…
పంచాయతీల్లో కార్యర్శులు చేపట్టిన పనుల నిజ నిర్ధారణ కోసం అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి యాప్లో ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎంపీవోలు ప్రతి నెలా 16 పంచాయతీల్లో పర్యవేక్షించాలి. డీఎల్పీవోలు 8, డీపీవోలు 5 పంచాయతీల్లో పర్యవేక్షించి పనుల ఫొటోలు అప్లోడ్ చేయాలి. వీరితో పాటు ఉపాధి హామీ పథకం విజిలెన్సు అధికారి, సహాయ అధికారి, నాణ్యత కమిటీకి చెందిన ఇద్దరు సభ్యులు రాష్ట్ర శాఖ నుంచి వచ్చిన మెసేజ్ ప్రకారం క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలి.
ఈ తరహా కార్యక్రమం పకడ్బందీగా అమలుకు నోచుకోవడంతో గ్రామాల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. పల్లె ప్రగతిలో పారదర్శకత, కచ్చితత్వం పెరిగింది. చేసిన పని చేసినట్లుగా రికార్డుకెక్కుతుండగా నకిలీ దందాకు, దొంగ పనులకు చెల్లు చీటి పడినట్లయ్యింది. యాప్ ఆధారంగా పంచాయతీ అధికారుల పనితీరు ఆధారపడి ఉండడంతో సాంకేతికత ఆధారంగానే అన్ని స్థాయిల్లోని అధికారులు తమ నిర్ధిష్ట పనిని పూర్తి చేస్తున్నారు.