నందిపేట్, జూలై 19 : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు ఎమ్మె ల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నందిపేట్ మండల కేం ద్రంలో సోమవారం రైతు వేదికను ఆయన ప్రారంభించారు. ఎన్టీఆర్ కాలనీలో పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలు, సౌకర్యాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడా రు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గంలో ప్రతి సోమవారం సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చించారు. సరికొత్త ఆలోచనతో క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో రైతుల కోసం మరెన్నో కొత్త పథకాలు ముందుకు రానున్నాయన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి లబ్ధిదారుడికి అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా నెల రోజుల్లో మిషన్ భగీరథ పథకం సమస్యలన్నీ పరిష్కారం కావాలని, ఏ సమస్య లేకుండా ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలని సంబంధిత ఏఈ, డీఈను ఎమ్మెల్యే ఆదేశించారు. ఉద్యానవన శాఖ ద్వారా పామాయిల్ మొక్కలు అందజేయనున్నట్లు తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల పాఠ్యపుస్తకాలను ఎమ్మెల్యే విడుదల చేశారు. నందిపేట్కు చెందిన పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామాలవారీగా సమావేశమై అభివృద్ధి పనులపై సర్పంచ్, ఎంపీటీసీలు, నాయకులతో చర్చించారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆశన్నగారి రాజేశ్వర్రెడ్డి, ఎంపీపీ వాకిడి సంతోష్రెడ్డి, జడ్పీటీసీ ఎర్రం యమున, వైస్ ఎంపీపీ దేవేంధర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూమేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.