కమ్మర్పల్లి, జూలై 16 : నీటి వృథాకు చెక్పెడుతూ ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టడానికి నిర్మించిన చెక్డ్యాములతో వాగులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో వాగుల తీరా ల్లో సాగు సందడి నెలకొంది. బాల్కొండ నియోజకవర్గం నడిబొడ్డుగుండా ప్రవహించే వాగుల తీరాల్లో సాగుపనుల్లో రైతన్నలు బిజీబిజీగా మారారు. గతంలో వానలు కురిసినా వాగుల వెంట భూములు మోడు వారి కనిపించేవి. చుక్క నీటి కోసం రైతులు చుక్కలు చూడాల్సిన దుస్థితి ఉండేది. వాగులు, వంకల్లో నీటిని ఒడిసి పట్టి రైతుకు ఉపయోగపడేలా చేయాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనలను రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అందిపుచ్చుకున్నారు.నియోజకవర్గంలో 42 కిలో మీటర్ల పొడవునా ప్రవహించే వాగుల్లో 33 గ్రామాలకు సాగు నీటి ప్రయోజనం కలిగేలా రూ.80 కోట్ల వ్యయంతో చెక్డ్యాములు నిర్మించారు. దీంతో రెండు పంటల కాలంలోనూ భూ గర్భ జలాలను అందిస్తున్నాయి. మరో రూ.20 కోట్లతో ఆరు చెక్ డ్యాముల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం రూ.వంద కోట్లతో చేపడుతున్న పనులతో వాగులు జలకళ, భూములన్నీ పచ్చదనం సంతరించుకోనున్నాయి.
పెరిగిన భూగర్భ జలాలు
బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్, వేల్పూర్, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో కప్పల వాగు, పెద్దవాగు కలిపి మొత్తం 42 కి.మీ. ప్రవహిస్తాయి. ఈ రెండు వాగుల వెంట ఇరువైపులా 33 గ్రామాలు ఉన్నాయి. ఈ రెండు వాగుల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మొదట ఆరు చెక్డ్యాములు మంజూరు చేయించారు. వీటి నిర్మాణం పూర్తి కాగానే వాగుల వెంట భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగాయి. అనంతరం రెండు, మూడో విడుతల్లో కలిపి మరో 12 చెక్డ్యాములు మంజూరు చేయించారు. వీటిలో 12 చెక్డ్యాములు పూర్తవగా ఆరు నిర్మాణంలో ఉన్నాయి. పూర్తయిన చెక్డ్యాముల వెంట వానకాలం, యాసంగిలో బారుబావుల కింద సకాలంలో పంటలు వేసుకుంటున్నారు. తాజాగా వరి, పసుపు, మక్కజొన్న, సోయాతోపాటు కూరగాయలు వేస్తున్నారు. బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో సకాలంలో వరి నారు పోసుకున్నారు. నాట్లు కూడా ఊపందుకుంటున్నాయి. పెద్దవాగు, కప్పల వాగు వెంట చెక్డ్యాముల మూలంగా సుమారు 40 వేల ఎకరాల్లో సాగుపనులు చేపడుతున్నారు. మరో నాలుగు చెక్డ్యాములు మంజూరు చేయించి మొత్తం 22 చెక్డ్యాములతో వాగులను నింపేందుకు మంత్రి వేముల కృషి చేస్తున్నారు.