నిజామాబాద్, జూలై 22, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎగువ మహారాష్ట్రతో పాటుగా రాష్ట్రంలో రెండు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలతో గో దావరి పోటెత్తుతున్నది. కర్షకుల్లో మోదం, ఖేదాన్ని మిగిలిస్తూ నది ప్రవహించే మార్గాలను ముంచెత్తి ముందుకు సాగుతున్నది. పరివాహక ప్రాంతాల్లోని ప్రజల్లో ఉగ్ర గోదావరితో ఓ రకంగా సంతోషం, అంతకంతకూ పెరుగుతున్న వరదతో గుబులు ఏర్పడుతున్నది. మహారాష్ట్ర నుంచి వస్తున్న గోదావరి జలాలు ఎస్సారెస్పీని ముద్దాడి దిగువకు పరుగులు తీస్తున్నది. వానకాలం సీజన్ ప్రారంభమైన కొద్ది కాలానికే ఎస్సారెస్పీ నిండుకుండలా మారి గేట్లు ఎత్తే పరిస్థితి రావడం దశాబ్ద కాలంలో తొలిసారి అని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
నిండుకుండలా వందలాది చెరువులు…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెరువులు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. కుండపోత వానతో అనేక చెరువులు మత్తడి దుంకుతుండగా మరికొన్ని నిండుకుండల్లా దర్శనం ఇస్తున్నాయి. ఉభయ జిల్లాలో 3,135 చెరువులున్నాయి. ఇందులో కా మారెడ్డి జిల్లాలో 2167, నిజామాబాద్లో 968 తటాకాలున్నాయి. అన్ని జలాశయాల్లోకి వరద వచ్చి చేరుతుండడంతో జలకళ సంతరించుకుంటున్నాయి. నిజామాబాద్లో 381 చెరువులు అలుగు పోస్తుండగా 211 చెరువులు 100శాతం మేర వరద నీటితో నిండుకున్నాయి. కామారెడ్డిలో 423 చెరువులు అలుగు పారుతుండగా, 427 చెరువులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరాయి. 50-75శాతం మేర నీటి నిల్వతో నిజామాబాద్లో 177, కామారెడ్డిలో 290 చెరువులున్నాయి.
పోటెత్తిన గోదావరి…
గోదావరి పోటెత్తుతున్నది. ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో వరద తీవ్ర స్థాయిలో వస్తున్న ది. జూలై నెలలోనే భారీగా తరలి వస్తోన్న వరదతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. కందకుర్తి త్రివేణి సంగమం మీదుగా గోదావరి నది ఉగ్రరూపంలో పారుతున్నది. ఊహించని విధంగా గురువారం ఒక్క రోజే(మధ్యాహ్నం 3గంటలకు) 4లక్షల క్యూసెక్కుల మేర వరద రావడంతో ఎస్సారెస్పీ గేట్లు ఎత్తి దిగువన ఉన్న గోదావరిలోకి వరదను వదిలారు. 4లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లోకు తగ్గట్లుగానే 2.5లక్షల అవుట్ఫ్లో కొనసాగించారు. మొత్తం 42 గేట్లకు గాను మొదట 8 గేట్లు ఎత్తి 50వేల క్యూ సెక్కుల వరదను కిందికి పంపించారు. ఎగువ నుంచి ప్రవాహం మరింత పెరుగడంతో సాయంత్రానికి 32 గేట్లు ఎత్తివేయాల్సి వచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో కేవలం సగానికి కన్నా తక్కువ నీరు మాత్ర మే నిల్వ ఉన్నది.
ఉదయం నుంచి సాయంత్రం దాకా…
జీవనది గోదావరి ఉప్పొంగుతున్నది. వాగులు, వంకల గుండా వస్తున్న భారీ వాన నీటితో జీవనది వరద గోదారిగా మారుతున్నది. ఎగువ నుంచి వస్తున్న నీటితో పరవళ్లు తొక్కుతూ గోదావరి ఉగ్రరూపాన్ని తలపిస్తున్నది. మహారాష్ట్రలోని బాలేగావ్ హైలెవెల్ బ్యారేజీ, విష్ణుపురి ప్రాజెక్టులోకి వరద జూలై మొదటి వారంలోనే భారీగా చేరింది. దీం తో ఈ రెండు ప్రాజెక్టుల గేట్లు జూలై 14నాటికే ఎత్తారు. జూలై 1 నుంచి బాబ్లీ గేట్లు కూడా ఎత్తివేయడంతో ఎగువ వర్షాలతో గోదావరి నది భారీ స్థాయిలో ప్రవహించడం మొదలు పెట్టింది. గడిచిన నాలుగైదు రోజులుగా భారీ వానలతో జీవనది ఉగ్రరూపంలో ప్రవహించడం మొదలైంది. ఫలితంగా గురువారం ఒక్క రోజే ఎస్సారెస్పీకి ఊహించని వరద వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రానికే 20 టీఎంసీల మేర వరద నీరు ఎస్సారెస్పీని ముద్దాడినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉద యం 70 టీఎంసీలుగా ఉన్న ఎస్సారెస్పీ నీటి మ ట్టం సాయంత్రానికి గరిష్ఠ నీటి మట్టం 90టీఎంసీలకు చేరింది. భారీ వరద మూలంగా అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు వెంటనే 42 గేట్లలో 32 గేట్లు ఎత్తి 2.5 లక్షల క్యూసెక్కులు మేర నీటిని దిగువ గోదావరిలోకి వదిలారు.