కామారెడ్డి టౌన్,జూలై 20: రాష్ట్రంలో 2014 సంవత్సరం తర్వాత అనుమతించిన లే అవుట్లపై ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ ఎన్. సత్యనారాయణతో కలిసి జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో లే అవుట్ అనుమతులు, ఆడిటింగ్, పట్టణాభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమతించిన లే అవుట్లలో పది శాతం ఖాళీ స్థలం స్థానిక/ పట్టణ సంస్థ పేరున రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. 10 శాతం ఓపెన్ స్పేస్ కన్నా తక్కువగా ఉంటే లే అవుట్ ఒరిజినల్ డెవలపర్ నుంచి ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం పెనాల్టీ వసూలుచేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పరిపాలనా పరిధిలో మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది పనిచేయాలన్నారు. లే అవుట్ అనుమతులకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీకి సహకరిస్తూ రెగ్యులేటరీ విధులు నిర్వహించాలని సూచించారు. టీఎస్ -బీపాస్ ద్వారా లే అవుట్ అనుమతులు నిర్దిష్ట సమయ పరిమితిలో మంజూరు చేయాలని అన్నారు. రాష్ట్ర స్థాయిలో ల్యాండ్ పూలింగ్పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు వర్క్షాప్ నిర్వహిస్తామని తెలిపారు.
పారిశుద్ధ్య నిర్వహణ పనులు పక్కాగా చేపట్టాలి
వర్షాకాలం నేపథ్యంలో పట్టణాలు, గ్రామాల్లో పారిశద్ధ్య నిర్వహణ పనులను పక్కాగా చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ ఎన్. సత్యనారాయణ సూచించారు. వ్యాధులు ప్రబలకుండా, దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మురుగు కాల్వల పూడికతీత పనులు చేపట్టాలన్నారు. ప్రతి ఆదివారం పది నిమిషాలు దోమలు వృద్ధి చెందకుండా పరిసరాల శుభ్రత, నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీసీలో కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పాల్గొన్నారు.