కామారెడ్డి టౌన్, జూలై 14: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పెండింగ్లో లేకుండా వెంటనే పూర్తిచేయాలని జహీరాబాద్ ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ బీబీ పాటిల్ అధికారులకు సూచించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ సమావేశపు మందిరంలో ఎంపీపీలు, జిల్లా అధికారులతో బుధవారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్లె, పట్టణ ప్రగతి పనులను ప్రజల భాగస్వామ్యంతో అధికారులు విజయవంతం చేశారని అన్నారు. కరోనా విపత్కర సమయంలో అధికార యంత్రాంగం అందించిన సేవలను ఎంపీ కొనియాడారు. అనంతరం కలెక్టర్ శరత్ మాట్లాడుతూ.. దేశంలో 111 రూర్బన్ క్లస్టర్లు ఉన్నాయని, అందులో జుక్కల్ దేశంలోనే నంబర్వన్గా ఉన్నదని తెలిపారు. జుక్కల్ క్లస్టర్కు రూర్బన్ కింద రూ.30 కోట్లతో 363 పనులు మంజూరు కాగా.. 280 పనులు పూర్తయ్యాయని, 81 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఈజీఎస్లో భాగంగా జిల్లాలో కూలీలకు కోటీ 16లక్షల 69వేల పనిదినాలు కల్పించి వారి ఖాతాల్లో రూ.185 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. ఈజీఎస్లో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండగా.. కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. అంతకుముందు జిల్లా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డి.వెంకటమాధవరావు గత సమావేశంలో చర్చించిన సమస్యలపై తీసుకున్న చర్యలను వివరించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్దోత్రే, కామారెడ్డి బల్దియా చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.