నిజామాబాద్, జులై 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం కోసం వచ్చే వారికి కొండంత భరోసా లభిస్తున్నది. రోగులకు గతంలో ఎదురైన కష్టాలేవీ కనిపించడం లేదు. ఆయా వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే ఆర్థిక భారం పడేది. ప్రభుత్వ వైద్యశాలల్లో సరైన రోగ నిర్ధారణ పరికరాలు లేకపోవడంతో ప్రైవేటు కేంద్రాల బాట పట్టాల్సిన పరిస్థితి ఉండేది. వేలాది రూపాయలు వెచ్చిస్తే గానీ పరీక్షల ఫలితాలు తెలిసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం 57 రకాల పరీక్షలను ఉచితంగా చేయించడానికి ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖానలో రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. జూన్ 9న ప్రారంభమైన డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా గడిచిన కొద్ది రోజుల్లోనే వేలాది మందికి లబ్ధి చేకూరుతున్నది. మొత్తం 42 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక వైద్యశాలల నుంచి వచ్చే నమూనాలను డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్షించి వాటి ఫలితాలను ఆయా దవాఖానలకు పంపిస్తున్నా రు. తద్వారా ప్రైవేటు డయాగ్నోస్టిక్ దోపిడీకి చెల్లుచీటి పడింది. రోజుకు సగటున 230 నుంచి 250 మంది రోగులకు సంబంధించిన ఆయా రకాల పరీక్షల కోసం నమూనాలు డయాగ్నోస్టిక్ సెంటర్కు వస్తున్నాయి.
10వేల ఫలితాలు వెల్లడి..
నిజామాబాద్ ప్రభుత్వ డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటు తో జిల్లాలోని పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతున్నది. సేవలు ప్రారంభమైన అనతి కాలంలోనే డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా వేలాది మందికి ఆర్థిక భారం తప్పినట్లయ్యింది. ఆయా రోగాలతో ఇ బ్బందులు పడుతున్న సామాన్యులకు ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా సులువుగా, వేగంగా, ఉచితంగా ఫలితాలు అందుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో రక్త, మూత్ర నమూనాలు సేకరించి వాటిని జిల్లా కేంద్రంలోని రోగ నిర్ధారణ కేంద్రానికి పంపిస్తున్నారు. ఇలా వచ్చిన నమూనాలను అధునాతన యంత్రాల సాయంతో పరీక్షలు నిర్వహిస్తారు. నిర్ణీత కాల వ్యవధిలో వాటికి సంబంధించిన ఫలితాలను సంబంధిత ఆరోగ్య అధికారికి పంపించడం ద్వారా పరీక్షల వివరాలు ఇట్టే చేరిపోతున్నాయి. పైసా ఖర్చు లేకుండానే రోగ నిర్ధారణ పరీక్షలు జరుగుతుండడంతో సామాన్య ప్రజలెంతో మందికి ఊరట కలుగుతున్నది. ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు 3,746 మంది రోగుల నుంచి 5,939 నమూనాలు సేకరించారు. ఆయా నమూనాల నుంచి 10,688 పరీక్షలు నిర్వహించారు. ఇందులో అత్యధికంగా నిజామాబాద్ డివిజన్లో 2,138 మంది నుంచి 3,270 నమూనాలను సేకరించగా.. 6,087 పరీక్షలు నిర్వహించారు. బోధన్ డివిజన్లో 872 మంది నుంచి 1,442 నమూనాలను సేకరించి 2,450 పరీక్షలు విశ్లేషించారు. ఆర్మూర్ డివిజన్ పరిధి లో 641 మంది నుంచి 1075 నమూనాల ద్వారా 1,860 పరీక్షలు నిర్వహించారు. నిజామాబాద్తో పాటు కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు చెందిన పీహెచ్సీల నుంచి వచ్చిన నమూనాలను పరీక్షిస్తున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే నమూనాలు…
టీ-డయాగ్నోస్టిక్ సెంటర్లో అన్ని రకాల పరీక్షలను నిర్వహిస్తారు. రోగులు ప్రత్యేకంగా జిల్లా జనరల్ దవా ఖానకు రావాల్సిన అవసరం లేదు. స్థానికంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వారి నుంచి అనారోగ్య సమస్యలను నిర్ధారించేందుకు రక్త నమూనాలు సేకరిస్తారు. నిజామాబాద్ జిల్లాలో 22 పీహెచ్సీలు, 9 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ఒక ప్రాంతీయ వైద్య శాల, ఒక జిల్లా దవాఖాన, జనరల్ వైద్యశాల ఉన్నది. ఆయా సర్కారు దవాఖానాల్లో సేకరించే రక్త నమూనాలు అన్నీ జీజీహెచ్లోని డయాగ్నోస్టిక్ సెంట్రల్ హబ్కు చేరుతాయి. అదే రోజున ఫలితం వెల్లడిస్తారు. ప్రతి రోగి నివేదికలను ఆన్లైన్లో పొందుపర్చనున్నా రు. థైరాయిడ్, ఐజీజీ, ఐజీఎం, చికున్గున్యా,సీడీ కౌం ట్, గ్లూకోజ్, ఆర్ఎఫ్టీ, కేఎఫ్టీ, లిపిడ్ ప్రొఫైల్, కొలె స్ట్రాల్, అన్ని రకాల క్యాన్సర్, ఇన్ఫెక్షన్లకు సంబంధించి న సీబీపీ, యూరిన్ అనలైసిస్, విటమిన్-డీ, విటమి న్-బీ 12 లోపాలు, సీ-రియాక్టివ్ ప్రొటీన్స్(సీఆర్పీ ), యూరియా-సీరం, క్రియాటినైన్- సీరం, లివర్ ఫంక్షన్ టెస్ట్(ఎల్ఎఫ్టీ), లాక్టేట్ డీహైడ్రోగెన్స్(ఎల్డీహెచ్) వంటి 57 రకాల రోగ నిర్ధారణకు సంబంధించి న పరీక్షలు, వాటి ఫలితాలను విశ్లేషించి నివేదికలు అం దించే అవకాశం ప్రభుత్వ జనరల్ దవాఖానకు దక్కింది.
ప్రైవేటు దోపిడీకి అడ్డుకట్ట…
నిజామాబాద్లోని ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లలో పరీక్షలకయ్యే ఖర్చు పేద, మధ్యతరగతి ప్రజలకు తడిసి మోపెడవుతున్నది. కొంత మంది వైద్యులు అనవసరమైన పరీక్షలు రాసి డబ్బులు గుంజేవారున్నారు. కేవలం రూ.వందల్లో వసూలు చేయాల్సిన ఫీజులను రూ.వేలల్లో వసూలు చేస్తూ దందా చేస్తున్న వారందరికీ ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సేవలతో దోపిడీకి అడ్డుకట్ట పడినట్లు అయ్యింది. నిష్ణాతులైన వైద్యులు, వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్న జీజీహెచ్లో డయాగ్నోస్టిక్ సెంటర్ లేకపోవడం ఇన్ని రోజుల పాటుగా వెలితిగానే ఉండేది. జీజీహెచ్లో అధునాతన వైద్య పరికరాలు ఏర్పాటు కావడంతో పేదలకు భారీ ఊరట దక్కింది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో కార్పొరేట్ వైద్యానికి దీటైన సేవలు అందుతున్నాయి. 500 పడకల సామర్థ్యం గల జీజీహెచ్లో ఏడాది కాలంగా కరోనా చికిత్స సైతం గాంధీ దవాఖానకు దీటుగా సేవలు లభిస్తున్నాయి.
అధునాతన సాంకేతిక పరికరాలున్నాయి
డయాగ్నోస్టిక్ కేంద్రానికి రూట్ మ్యాప్ ద్వారా జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించాం. నమూనాల సేకరణకు పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి తో డయాగ్నోస్టిక్ కేంద్రంలో రూ.5కోట్లు విలువ చేసే అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేసింది. ప్రతి రోజూ వేయి నుంచి 2వేలకు పైగా పరీక్షలు చేసి నివేదికలు ఇచ్చే సామర్థ్యం ఇప్పుడిక్కడ ఏర్పాటు అయ్యింది. దశల వారీగా సామర్థ్యాన్ని పెంచుతాం. తెలంగాణ డయాగ్నోస్టిక్ సేవల ద్వారా పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండానే సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు దక్కుతున్నాయి.