బాన్సువాడ, జూలై 16: కల్కి చెరువు కట్ట మరమ్మతు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన బాన్సువాడలోని కల్కి చెరువు కట్ట వద్ద కొనసాగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. పనుల వివరాలను నీటి పారుదల శాఖ డీఈ శ్రావణ్కుమార్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అక్కడే పనిచేస్తున్న వడ్డెరలతో ముచ్చటించి పలు సూచనలు చేశారు. అనంతరం స్థానిక నాయకులతో మాట్లాడారు. తాను 1969లో కాంట్రాక్టర్గా పనిచేశానని తెలిపారు. నిజాంసాగర్పై చేపట్టిన గేట్ రిపేర్ తదితర పనులను నాణ్యతతో చేపట్టినట్లు చెప్పారు. లారీ డ్రైవర్లతో గుట్టల్లో పనులు చేసే చోట గుడిసెల్లో నిద్రించినట్లు గుర్తుచేసుకున్నారు. తాను 1977లో చెరువు పనులు చేపడుతుండగా, అప్పటి ఎమ్మెల్యే గా ఉన్న శ్రీనివాస్రావు వచ్చి తనను బలవంతంగా బోధన్కు కారులో తీసుకెళ్లారని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలని మనసును మళ్లించారని చెప్పారు. అప్పటి నుంచి ఎన్నో వ్యాపారాలు చేసి ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. స్పీకర్ వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గురు వినయ్కుమార్ తదితరులు ఉన్నారు.