ఎడపల్లి (శక్కర్నగర్), సెప్టెంబర్ 21:గ్రామం చిన్నదే అయినా, ప్రభుత్వం అందిస్తున్న నిధులతో చక్కగా అభివృద్ధి చెందుతూ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ధర్మారం ఆదర్శంగా నిలుస్తున్నది. మొదటి విడుత ‘పల్లెప్రగతి’లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మండలంలో ఎంపికైన మూడు ఆదర్శ గ్రామాల్లో ధర్మారం ఒకటి. బోధన్- నిజామాబాద్ రహదారికి లోపలికి ఉన్న ఈ గ్రామంలో చేసిన పనులు, పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. గ్రామంలో 183 గృహాలు, 764 మంది జనాభా నివసిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా పక్కా సీసీ డ్రైనేజీల నిర్మాణాలు, ఎల్ఈడీ బల్బులతో రాత్రి సమయాల్లో కాంతులీనేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటా నల్లా కనెక్షన్ ఏర్పాటు చేశారు. శుద్ధమైన నీరు అందించాలనే ఉద్దేశంతో ప్రతీ శుక్రవారం గ్రామంలోని నీటి ట్యాంకును శుభ్రం చేస్తారు. గ్రామంలో అపరిశుభ్రత చోటు చేసుకోకుండా ఇంటింటికీ తడి,పొడి చెత్త సేకరణకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు.
పల్లెప్రగతిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు..
రూర్బన్ నిధులు రూ.5.5లక్షలతో గ్రామం నడిబొడ్డున బస్టాండ్ను నిర్మించారు. గ్రామ శివారులో ఉన్న స్థలంలో నర్సరీని ఏర్పాటు చేశారు. పక్కనే కంపోస్ట్ షెడ్డు నిర్మించి, సేంద్రియ ఎరువుల తయారీకి చర్యలు చేపట్టారు. గతంలో శ్మశాన వాటికలు భయాందోళన కలిగించగా నేడు ‘వైకుంఠధామం’ పేరుతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు ఇబ్బందులు తీరాయి. ఎంఎస్సీ ఫారం నుంచి ధర్మారం వచ్చే రోడ్డు పక్కనే ఏర్పాటు చేసిన ‘పల్లె ప్రకృతివనం’ ఆహ్లాదకరంగా రూపుదిద్దుకున్నది. ఎక్కడా లేని విధంగా ఈ ప్రకృతి వనంలో ‘రాక్గార్డెన్’ను ఏర్పాటు చేశారు. చిన్నారుల కోసం ఊయలలు, జారుడు బండలు ఏర్పాటు చేశారు.
చకచకా చేయించాం..
చిన్న గ్రామమే అయినా, ప్రభుత్వం అందించిన నిధులతో అన్ని అభివృద్ధి పనులు చకచకా చేయించాం. ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా నిత్యం పారిశుద్ధ్య పనులు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం. మా గ్రామం రోడ్డుకు దూరంగా ఉండేది. అభివృద్ధిలో కూడా అంతే దూరంగా ఉండేదని బాధపడేవాళ్లం. సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మా గ్రామం ఆదర్శంగా మారడం సంతోషంగా ఉంది.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాం..
ధర్మారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిచేసి మండలంలో ఆదర్శంగా తీర్చిదిద్దాం. మండలంలో ఎంపికైన మూడు ఆదర్శగ్రామాల్లో ధర్మారం ఒకటి కావడం సంతోషంగా ఉంది. దీనికి తోడు జిల్లాలోని 530 పంచాయతీల్లో తమ గ్రామానిది 8వ స్థానం అని కేంద్ర బృందం నిర్ధారించింది. చేసిన పనులకు గుర్తింపు లభించింది. రాబోయే రోజుల్లో గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేయిస్తాం.