బాన్సువాడ , జూ లై 22: ఆర్థిక స్థోమత లేక, ప్రైవేటు దవాఖానల చుట్టూ తిరుగలేక అవస్థలు పడుతున్నవారికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి. టీఆర్ఎస్ యువనేతగా, రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడిగా బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడంతోపాటు.. అత్యవసర వైద్యం కోసం ఎవరైనా ఒక్కఫోన్కాల్ చేస్తేచాలు సహాయం అందిస్తున్నారు. జిల్లాకేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా సింగిల్విండోల బలోపేతానికి కృషి చేస్తున్నారు. ప్రజాజీవితంలో చురుగ్గా ఉంటూనే.. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రమాదాల బారినపడో, ఆరోగ్యం క్షీణించో అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ వచ్చేవారికి భాస్కర్రెడ్డి చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. దవాఖానల్లో తక్షణ వైద్యసేవలందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆపత్కాలంలో ఆర్థికస్థోమత లేని వందలాదిమంది రోగులకు రాజకీయాలకు అతీతంగా ఆయన ఆపన్నహస్తం అందించారు.
పేద విద్యార్థులకు అండగా…
ఉమ్మడి జిల్లాలోని పేద విద్యార్థులకు పోచారం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బాన్సువాడలో గ్రూప్-1, గ్రూప్-2 కోచింగ్ సెంటర్ను సుమారు రూ.50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన భాస్కర్రెడ్డి.. ఎందరో పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశారు. కరోనా సమయంలో నియోజకవర్గంలోని ఆరు వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, 25కిలోల సన్నబియ్యం అందించి అందరి మన్ననలు పొందారు.