ఖలీల్వాడి/ డిచ్పల్లి, జూలై 18 : కరోనా మొదటి, రెండో వేవ్లతో ఏడాదిన్నర కాలంగా ప్రజలు సతమతమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవడంతో కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసింది. ప్రజలు కనీస జాగ్రత్తలను పట్టించుకోవడం లేదు. దీంతో పెనుప్రమాదం ముంచుకొచ్చే ప్రమాదం ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. గుంపులు గుంపులుగా తిరుగుతూ మళ్లీ అదే తప్పును పునరావృతం చేస్తున్నారు.రెండు వేవ్లో వేలాది మంది కరోనా వైరస్ బారిన పడి ఇబ్బందులకు గురయ్యారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. ప్రతి రోజూ కేసులు నమోదవుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. మరి కొంత మంది కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నామనే ధీమాతో ప్రాథమిక జాగ్రత్తలు పాటించకుండా తిరుగుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానలో సుమారు 70 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రోజుకు 20కి పైగా కేసులు నమోదవుతున్నాయి. కనీస జాగ్రత్తలు పాటించకుండా చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కరోనా థర్డ్వేవ్ మరింత ప్రభావం చూపుతుందని డబ్ల్యూహెచ్వో హెచ్చరిస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటి జ్వర సర్వేను నిర్వహించి కరోనాను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.
థర్డ్వేవ్ను సమర్థవంతంగా తరిమికొట్టేందుకు చర్యలు తీసుకుంటున్నది. థర్డ్వేవ్ను అడ్డుకోవడానికి ప్రభుత్వ చర్యలకు తోడు ప్రజలు సైతం సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈసారి చిన్న పిల్లలపై మహమ్మారి పంజా విసిరే ప్రమాదం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
అధికార యంత్రాంగం సన్నద్ధం
థర్డ్వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా దవాఖానలో రూ. కోటితో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు పిల్లలకు సంబంధించిన వార్డును, బెడ్లను అదనంగా ఏర్పాటు చేశారు. దవాఖానలో 24 గంటల పాటు రోగులను పర్యవేక్షించేందుకు పీడియాట్రిక్ బృందాన్ని ఇప్పటికే నియమించారు. గతంలో కరోనా మహమ్మారి విరుచుకుపడిన సమయంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై నెల రోజుల్లో కేసులను తగ్గుముఖం పట్టించారు. మహారాష్ట్ర జిల్లాకు దగ్గరగా ఉండడంతో కేసులు విపరీతంగా వెలుగు చూశాయి. ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం అందించి వేలాది మందికి చికిత్స అందించారు. అవసరమైతే తప్ప బయటికి రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి.
ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లే సమయంలో మాస్కులను తప్పనిసరిగా ధరించాలి. భౌతిక దూరం పాటించడంతో పాటు జనసమ్మర్థ ప్రాంతాలకు వెళ్లకుండా చూసుకోవాలి. పని ప్రదేశాల్లో చేతులు శుభ్రపర్చుకునేందుకు సబ్బులు, శానిటైజర్ ఉంచుకోవడం మంచిది. రక్తపోటు, మధుమేహం, గుండెకు సంబంధించిన సమస్యలు, మూత్రపిండ వ్యాధులు, క్యాన్సర్ ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు అత్యవసర చికిత్సలకు తప్ప ఇతర ప్రయాణాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ ప్రమాదం ఇంకా పొంచి ఉందని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా అరికట్టవచ్చని వైద్యులు తెలుపుతున్నారు.