మెండోరా, జూలై 13 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటున్నది. సీజన్ ప్రారంభం నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్రలో గల విష్ణుపురి, బాలేగావ్, బాబ్లీ ప్రాజెక్టులు నిండాయి. దీంతో మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్లో నీటి మట్టం 1078.50 అడుగులకు చేరుకోవడంతో వానకాల పం టలకు, తాగు నీటికి ఢోకా లేకుండా పో యింది. లక్ష్మి కాలువ ఆయకట్టు పరిధిలోని 25,763ఎకరాలకు 3 టీఎంసీలు, చౌట్పల్లి హన్మంత్రెడ్డి ఎత్తి పోతల పథకం పరిధిలోని 8,297 ఎకరాలకు 0.80 టీఎంసీలు, అలీసాగర్ ఎత్తిపోతల పరిధిలోని 52 వేల ఎకరాలకు 4.47 టీఎంసీలు, గుత్ప ఎత్తిపోతల పరిధిలోని 35 వేల ఎకరాలకు 2.80 టీఎంసీల నీరు అవసరమని నిర్ణయించారు. సరస్వతీ కాలువ ఆయకట్టు పరిధిలోని 35,738 ఎకరాలకు 2.96 టీఎంసీల నీటి విడుదలకు నిర్ణయించారు. కాకతీయ కాలువ ఆయకట్టు ఎల్ఎండీ ప్రాజెక్టు వరకు 9,182 ఎకరాలకు నీటిని విడుదలకు నిర్ణయం తీసుకోలేదు. లక్ష్మి కాలువ ద్వారా ఈ నెల 11వ తేదీన నీటిని విడుదల చేశారు. సరస్వతీ కాలువ ఆయకట్టు అయిన నిర్మల్ జిల్లాకు15వ తేదీన నీటిని విడుదల చేయనున్నారు.
జలకళను సంతరించుకున్న ఎస్సారెస్పీ
మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగావ్, నిజామాబాద్, నిర్మల్ జిల్లా గోదావరి పరీవాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. 24 గంటల వ్యవధిలో 10 టీఎంసీల నీటిమట్టం పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా మంగళవారం రాత్రి వరకు 1078.50 అడుగులు 48.449 టీఎంసీల నీటిమట్టానికి చేరుకున్నది. బాలేగావ్ నుంచి 43,000 క్యూసెక్కులు, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో 7,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి మొత్తం 50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది.