సిరికొండ/డిచ్పల్లి/ఖలీల్వాడి(మోపాల్)/చందూర్/ఆర్మూర్/ నిజామాబాద్ రూరల్/, జూలై 20 : జిల్లాలో హరితహారం కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్నది. ఆయా మండల కేంద్రా లు, గ్రామాల్లో ప్రజలు, అధికారులు మంగళవారం మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ చర్యలను అధికారులు పరిశీలించారు. సిరికొండలో సర్పంచ్ ఎన్నం రాజిరెడ్డి ఇంటింటికీ ఆరు చొప్పున మొక్కలను పంపిణీ చేశారు. డిచ్పల్లి మండలం నడిపల్లిలో కొనసాగుతున్న అవెన్యూ ప్లాంటేషన్ పనులను ట్రైనీ కలెక్టర్ మకరంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రహదారికి ఇరువైపులా నాటుతున్న మొక్కలను పరిశీలించారు. ఆయనవెంట ఎంపీడీవో సురేందర్, జాతీయ రహదారి అథారిటీ అధికారులు తదితరులు ఉన్నారు. మోపాల్ మండలం మంచిప్పలో డీపీవో జయసుధ, ఎంపీడీవో సుధాకర్రావు పర్యటించారు. పల్లెప్రకృతివనం, క్రిమిటోరియం, సీసీ రోడ్ల పనులను పరిశీలించారు. వారివెంట సర్పంచ్ సిద్ధార్థ, ఉప సర్పంచ్ జగదీశ్ తదితరులు ఉన్నారు. చందూర్ మండల కేంద్రంలో యల్లమల శేఖర్, కార్యదర్శి సాయిలు మొక్కలు నాటారు.
నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆర్అండ్బీ రోడ్లకిరువైపులా మొక్కలునాటే ప్రక్రియ జోరుగా సాగుతోంది. చక్రధర్నగర్ తండా, గాంధీనగర్ తండా, మల్కాపూర్ తండా, ముత్తకుంట గ్రామాల శివార్లలో ఉన్న ఆర్అండ్బీ రోడ్లకిరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంలో సర్పంచులు, కార్యదర్శులు నిమగ్నమయ్యారు. ఎంపీడీవో మల్లేశ్, ఎంపీవో మధురిమ, ఏపీవో పద్మ హరితహారం పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆర్మూర్లో హరితహారం కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, మండలంలో ఎంపీపీ పస్కనర్సయ్య, జడ్పీటీసీ సంతోష్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు లింగారెడ్డి, ఎంపీడీవో గోపీబాబు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ పట్టణంలోని ప్రధాన రోడ్లను మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయిస్తూ పలు సూచనలు చేశారు. మండలంలో ని చేపూర్ గ్రామంలో ఎంపీడీవో గోపీబాబు, సర్పంచ్ సాయన్న మొక్కలు నాటారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణ లో ఎంపీపీ నర్సయ్య, జడ్పీటీసీ సంతోష్, పిప్రి ఎంపీటీసీ సురేశ్ మొక్కలు నాటి నీళ్లు పోశారు.