నిజామాబాద్ రూరల్, జూలై 19 : డ్వాక్రా సంఘాల మహిళలు బ్యాంకుల ద్వారా పొందుతున్న రుణాలను ఆదాయాభివృద్ధికి వినియోగించుకునేలా చూడాలని డీఆర్డీవో చందర్నాయక్ ఆదేశించారు. మండలంలోని పాంగ్రాలో ఉన్న రూరల్ మండల ఐకేపీ కార్యాలయ భవనంలో నిజామాబాద్ డివిజన్ స్థాయి ఏపీఎం, సీసీలతో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. నెలవారీగా నిర్దేశించిన బ్యాంకు రుణాల పంపిణీ లక్ష్యాన్ని సాధించేందుకు చొరవ చూపాలని సూచించారు. పుస్తక నిర్వహణ, ఐకేపీ తరఫున చేపడుతున్న కార్యక్రమాల వివరాలను సెర్ప్ సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. తమ అవసరాల నిమిత్తం తీసుకున్న రుణాలను ప్రతినెలా వాయిదాల డబ్బులు బ్యాంకుకు 100 శాతం చెల్లించేలా చూడాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపాలని, రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో కిచెన్గార్డెన్ ఏర్పాటు చేసి సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను పెంచేలా డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రేరణ కల్పించాలన్నారు. అనంతరం ఐకేపీ కార్యాలయ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. సమావేశంలో ఏపీడీ మధుసూదన్, డీపీఎంలు శ్రీనివాస్, మారుతి, నీలిమా, సాయిలు, రాచయ్య, సంధ్యారాణి, ఏడు మండలాల ఏపీఎంలు, సీసీలు సిబ్బంది పాల్గొన్నారు.