బీర్కూర్/ బాన్సువాడ, జూలై 13: డబుల్ బెడ్ రూం ఇండ్లు అర్హులకే అందేలా చూడాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాన్సువాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. బాన్సువాడ నియోజకవర్గానికి రూ.100 కోట్ల నిధులు స్పెషల్ డెవలప్మెంట్ ద్వారా మంజూరు చేశారన్నారు. మరో ఐదువేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ పనులకు డిపార్ట్మెంట్ నుంచి అనుమతి లభించిందని, నామినేషన్ పద్ధతిలో చేసే పనులను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన వీసీలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బీర్కూర్ మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, ఎంపీపీ తిలకేశ్వరి రఘు, జడ్పీటీసీ స్వరూప, కో-ఆప్షన్ మెంబర్ ఆరీఫ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఉప సర్పంచులు, రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.