వర్ని, జూలై 18: ఐదు వందల జనాభా దాటిన ప్రతి తండాను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీగా మార్చడంతో వర్ని మండలంలోని అంతాపూర్ తండాకు మహర్దశ పట్టింది. మండల కేంద్రానికి ఆనుకొని, మండల కేంద్రంలో ఒక ప్రాంతంలా ఉన్న అంతాపూర్ తం డా ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేదు. చాలీచాలని నిధులతో ఏ పనులు చేపట్టాలో తెలియ ని పరిస్థితిలో అధికారులు, ప్రజాప్రతినిధులు తికమకపడుతూ అభివృద్ధిని కుంటి నడక నడిపించా రు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో అంతాపూర్లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. గతంలో మల్లారం గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న అంతాపూర్ తండా రెండేండ్ల క్రితం ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది.
మారిన రూపురేఖలు..
కేవలం రెండేండ్లలోనే అంతాపూర్ తండా రూపురేఖలు మారాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పంచాయతీకి పెద్ద మొత్తంలో నిధులు సమకూరాయి. దీంతో తండాలో ప్రధాన సమస్యగా ఉన్న పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి మురికి కాలువల నిర్మాణం చేపట్టారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్డు, డంపింగ్ యార్డులను నిర్మించారు. రెండేండ్లలో సుమారు రూ.20లక్షల వ్యయంతో అభివృద్ధి పనులను చేపట్టి అందమైన గ్రామంగా తీర్చిదిద్దారు.
పచ్చదనం, పరిశుభ్రత..
పల్లె ప్రగతిలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలతో అంతాపూర్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరుస్తున్నది. పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. మురికి కాలువలు నిర్మించడంతో దోమల బెడద తప్పింది. హరితహారంలో భాగంగా పల్లె ప్రకృతి వనంతోపాటు ప్రజల ఇంటి ఆవరణల్లో మొక్కలను నాటారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
దాతల సహకారంతో..
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతోపాటు గ్రామానికి చెందిన పలువురు దాతలు విరాళం అందిస్తూ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు మరమ్మతులు చేసి రంగులు వేయించారు. అంగన్వాడీ కేంద్రం వద్ద మరుగుదొడ్డి నిర్మించారు. పల్లె ప్రకృతి వనంలో దాతలు అందించిన విరాళాలతో ప్రత్యేకంగా బెంచీ లు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూర్చేందుకు పల్లె ప్రకృతి వనంలో ప్రత్యేక వంగడాల మామిడి, బొప్పాయి తదితర మొక్కలను పెంచుతున్నారు. అభివృద్ధి పనులను బేరీజు వేసుకున్న మండల అధికారులు, ఉత్త మ జీపీగా ఎంపిక చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
తండా బాగుపడింది
సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత మా తండా దశ తిరిగింది. రెండేండ్లలోనే గ్రామం అభివృద్ధి చెందడం..ప్రత్యేక పంచాయతీగా ఏర్పడిన తర్వాత తొలి సర్పంచ్గా ఎన్నికవ్వడం నా అదృష్టం. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడంతో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీ తదితర పనులన్నీ పూర్తి చేసుకున్నాం. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతో మా గ్రామానికి నిధులు మంజూరవుతున్నాయి. మున్ముందు మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా.
-పద్మాజగ్రాం, సర్పంచ్
ప్రత్యేక నిధులతో అభివృద్ధి..
ప్రత్యేక పంచాయతీ ఏర్పడిన తర్వాత ఈ గ్రామానికి పంచాయతీ కార్యదర్శిగా వచ్చాను. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక నిధులు విడుదల చేయడంతో గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తున్నది. ట్రాక్టర్ను కొనుగోలు చేసి పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపడుతున్నాం. హరితహారంలో భాగంగా గ్రామంలో 4వేల మొక్కలు నాటాం. విలేజ్ నర్సరీలో గ్రామస్తులకు కావాల్సిన మొక్కలను పెంచుతున్నాం.
-వినోద్, పంచాయతీ కార్యదర్శి