నిర్మల్ అర్బన్ : అర్హత ఉన్న ప్రతి గిరిజనుడు సాగు చేసుకుంటున్న భూమికి హక్కు పత్రాలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..2005 తర్వాత గిరిజనుల సాగులో ఉన్న అటవీ భూముల వివరాలను వెంటనే అధికారులు సబ్ కమిటీకి అందజేయాలని అధికారులకు ఆదేశించారు. 2005 సంవవత్సరం నుంచి గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములకు ఆర్ఎఫ్ఆర్ పాసు పుస్తకాలు అందించారని అన్నారు. స్థానిక సమస్యలు తెలుసుకుని వాటిని పరష్కరించే లక్ష్యంతో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు కృషి చేయాలన్నారు.
గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీలలో కూడా ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద అందరికి టీకాలు వేసి థర్డ్ వేవ్ రాకుండా తగు చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ధరణి పోర్టల్ను ప్రవేశపెట్టి భూముల రిజిస్ట్రేషన్లో ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలని వివరించారు. పప్పు దినుసులకు ఎక్కువగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో శనగలు, నువ్వులు, కందులు, వేరు శనగ తదితర పంటల సాగుపై ఆసక్తి చూపాలని అన్నారు. దొడ్డు బియ్యం కొనుగోలును నిరాకరించినందున వేసవిలో దొడ్డు బియ్యం సాగు చేయవద్దని మంత్రి రైతులకు సూచించారు.
జిల్లాలోని సారంగపూర్ మండలంలోని భూములు ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా ఉన్నందున రైతులు ఆయిల్ ఫామ్ సాగును చేయాలని కోరారు. ముథోల్ ఎమెల్యే విఠల్ రెడ్డి,ఖానాపూర్ ఎమెల్యే రేఖా నాయక్, జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, ఐటీడీఏ పీవో భువనేష్ మిశ్రా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నర్మదా ముత్యం రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ ఎరవోతు రాజేందర్, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, పి.రాంబాబు, డీఎఫ్వో వికాస్మీన, జడ్పీటీసీలు, ఎంపీపీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.