నిర్మల్ అర్బన్ : స్వరాష్ట్ర సాధన కోసం తన రాజకీయ పదవిని వదులుకున్న మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుడు, నిబద్ధత కలిగిన రాజకీయవేత్త బడుగుబలహీన వర్గాల స్ఫూర్తి ప్రధాత కొండా లక్ష్మణ్ బాపూజీ 106 జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాపూజీ చిన్న వయస్సులోనే ఎన్నో కష్టాలను అనుభవించి ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు.లాయర్గా పని చేస్తూ బడుగుబలహీన వర్గాల వారికి తనవంతుగా సహాయ సహకరాలు అందించారన్నారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తి ఆసిఫాబాద్ నియోజక వర్గానికి తొలి శాసన సభ్యులని, తెలంగాణ ఉద్యమంలో తన పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ కొండా లక్ష్మణ్ బాపూజీ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. స్వరాష్ట్రంలోనే మహనీయుల జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని గుర్తు చేశారు.
కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్, బీసీ వెల్ఫేర్ అధికారి సుజయ్, కౌన్సిలర్లు నేరేళ్ల వేణు, బిట్లింగ్ నవీన్, ఎస్.పి. రాజు, ఎడిపెల్లినరేందర్, నాయకులు అడ్ప పోశెట్టి, ఆయా శాఖల అధికారులు, పద్మశాలీ సంఘ సభ్యులు రమణ, జల్ధ రమణ, రాజేశ్వర్, హరిదాసు, రమేశ్ యువజన సంఘ సభ్యులు, పోపా సంఘ సభ్యులు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.