నిర్మల్ టౌన్, నవంబర్ 25: నిర్మల్ జిల్లాలో వ్యవసాయం, గృహాలకు నాణ్యమైన 24 గంటల కరంట్ను అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నది. స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి కొత్తగా జిల్లాలో 420, 220, 110, 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్లను నిర్మించి వాటి పరిధిలో విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసింది. నాలుగేళ్లలో 33 కొత్త 33/11కేవీ సబ్స్టేషన్లు నిర్మించగా, 400 కేవీ, 200 కేవీ సబ్స్టేషన్లు మూడు నిర్మించారు. జిల్లాలో మొత్తం ఐదు సబ్ డివిజన్లుండగా.. నిర్మల్, నిర్మల్ రూరల్, ఖానాపూర్, భైంసా, ముథోల్ సబ్డివిజన్ పరిధిలో మొత్తం 3. 50లక్షల వరకు విద్యుత్ వినియోగదారులున్నారు. ఇందులో 62వేలు వ్యవసాయ వినియోగదారులు ఉండగా, వీరి కోసం జిల్లాలో 25, 63, 100, 15, 16 కేవీల ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ఈ ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలందించేందుకు ఆన్లైన్ సర్వీస్ విధానాన్ని అమలు చేస్తున్నారు.
ఆన్లైన్ సర్వీస్తో తగ్గిన నష్టాలు…
నిర్మల్ జిల్లాలో తరచుగా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లలో జరిగే నష్టాన్ని నివారించేందుకు నిర్మల్లో ప్రయోగాత్మకంగా ఆన్లైన్ పౌరసేవల విధానాన్ని అమలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఆయా మండలాల పరిధిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల ఇంక్యుమెట్ నంబర్ను కేటాయించి లోకేషన్ను గుర్తిస్తూ ప్రత్యేక యాప్ను రూపొందించారు. ఈ యాప్లో ఎస్ఈతో పాటు, డీఈ, ఎమ్మార్పీ డీఈలు, ఏఈలు, లైన్మెన్ల నంబర్లను అనుసంధానం చేశారు. గ్రామాల్లో ఏదైనా సమస్య తలెత్తితే అక్కడ ఉన్న వారు సంబంధిత లైన్మెన్కు సమాచారం ఇవ్వడమే కాకుండా, ఆన్లైన్ యాప్ద్వారా జిల్లా కేంద్రానికి సమాచారం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వెంటనే ఐదు నిమిషాల్లోనే సిబ్బంది చేరి అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేయడం, కాలిపోతే నిర్మల్కు తరలించి 12 గంటల్లోపే కొత్త ట్రాన్స్ఫార్మర్ను అక్కడికి తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. గత నాలుగేళ్లలో ట్రాన్స్ఫార్మర్ చెడిపోయిన కేసులు గణనీయంగా తగ్గిపోయాయి. 2015లో 18శాతం ఉన్న నష్టాలు ప్రస్తుతం 11.97శాతానికి తగ్గించినట్లు ఎమ్మార్పీ పర్యవేక్షకుడు శ్రీనివాస్రావు తెలిపారు. గతంలో రైతులు తన సొంత వాహనంలో ట్రాన్స్ఫార్మర్లను నిర్మల్కు తీసుకొచ్చి కొత్త ట్రాన్స్పార్మర్లను తీసుకెళ్లేవారు.
దీనివల్ల రైతులపై రవాణా చార్జీల భారం పడేది. అయితే ఇప్పుడు యాప్ ద్వారా జిల్లా కేంద్రానికి సమాచారం రావడంతో విద్యుత్ సిబ్బందే తమ వాహనంంలో ట్రాన్స్ఫార్మర్లను తరలిస్తున్నారు. ప్రస్తుతం ట్రాన్స్ఫార్మర్ల పేలుళ్లను గణనీయంగా తగ్గించినట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ఎక్కడైనా కాలిపోయినా, చెడిపోయినా, సాంకేతిక లోపం ఏర్పడినా, సంబంధిత ప్రాంతం నుంచి ఫొటో తీసి వాట్సాప్లో పెడితే తక్షణం సిబ్బంది అక్కడికి చేరుకొని మరమ్మతులు చేస్తారు. 2018-19లో నిర్మల్ జిల్లాలో మొత్తం 14,460 ట్రాన్స్ఫార్మర్లుండగా.. 1975, 2019-20లో 15912 ట్రాన్స్ఫార్మర్లకు 2423, 2020-21లో 16,813 ట్రాన్స్ఫార్మర్లకు 2 వేలు మాత్రమే కాలిపోయినట్లు తెలిపారు. 2021-22లో ఇప్పటివరకు 17,100 ట్రాన్స్ఫార్మర్లుండగా.. కేవలం 1410 ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే కాలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కసారి ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రూ. 25వేల నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పరిరక్షించుకునేందుకు జిల్లాలో అమలవుతున్న ఆన్లైన్ పౌర సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
పనిభారం తగ్గింది..
రెండుమూడేండ్ల నుంచి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం తగ్గింది. దీంతో పాటు మాకు పనిభారం కూడా తగ్గింది. గతంలో రోజుకు 10 నుంచి 15 కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు వచ్చేవి. ఇప్పడు ఒకట్రెండు మాత్రమే వస్తున్నాయి. దీంతో ఏరోజుకారోజు మరమ్మతు చేసి, తిరిగి రైతులకు అందిస్తున్నాం. ఆన్లైన్ విధానం అమలుతో ఎక్కడ ఏ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందో మాకు ముందే సమాచారం వస్తున్నది. దీంతో అక్కడికి వేరే ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేలా కృషిచేస్తున్నాం.