పెంబి : ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ సూచించారు. పెంబి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ భూక్యా కవిత ఆధ్వర్యంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు సూచించే పనులను పరిష్కరించాలన్నారు. అటవీ, విద్యుత్, మత్స్య, ఎక్సైజ్, ఐటీడీఏ, ఉద్యానవన, సరస్వతి కెనాల్ శాఖల అధికారులు సమావేశానికి గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైనా అధికారులపై చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించి కలెక్టర్కు నివేదించాలని పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో విద్యుత్ శాఖ అధికారులు సమస్యలను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు.
విద్యుత్ షాక్కు గురై చనిపోయినా వ్యక్తులు, పశువులకు పరిహరం అందించేలా చర్యలు తీసుకోవాలని వైటర్నరీ, విద్యుత్శాఖ అధికారులను ఆదేశించారు. కొన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, ఉపాధిహామీలో పనులు చేసిన కూలీలకు డబ్బులు చెల్లించడంలేదని, మారుమూల గ్రామాలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సర్పంచ్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకోచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలపై సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, వైస్ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, ఎంపీడీవో సాయన్న, తాసిల్దార్ రాజ్మోహన్, ఆయా శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.