ఖానాపూర్ టౌన్ : శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీధులు నిర్వహిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో పోలీసు అమరవీరుల స్మారక స్తూపం వద్ద స్థానిక సీఐ అజయ్బాబు, ఎస్ఐ రామునాయక్తో కలసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్లాకల్లోలంగా ఉండే ఖానాపూర్ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా పోలీసులు శాంతి భద్రతలను కాపాడి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చారని పేర్కొన్నారు.
వృత్తి పరిరక్షణలో ఖానాపూర్ పాత సర్కిల్ పరిధిలో 19 మంది పోలీసులు తమ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని సీఐ అజయ్బాబు అన్నారు. భవిష్యత్లోనూ దేశభద్రతకు పోలీసుల ధైర్యసాహసాలే కీలక పాత్ర పోశిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, వైస్ చైర్మన్ గొరె గంగాధర్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువజన సంఘాల నాయకులు పాల్గొని అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.