బాసర : బాసరలో అంగరంగ వైభవంగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వరోజు సరస్వతి అమ్మవారు మహాగౌరి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గురువారం అమ్మవారికి ఆలయ అర్చకులు చక్కెర పొంగలి నైవేద్యం సమర్పించారు. అమ్మవారిని భక్తులు దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. కాగా దేవాదాయశాఖ కమిషనర్ అనీల్కుమార్, తోగుట పీఠాధిపతి మహానంద సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. బాసర చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులకు పూజ విధానంపై పీఠాధిపతి తగు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శరత్పాఠక్ కమిషనర్ను కండువాతో సన్మానించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం కమిషనర్ ఆలయ పరిసరాలను, మాస్టర్ప్లాన్ను పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏయే పనులు నిర్వహించాలో అధికారులను సూచించారు. భక్తులకు ఉపయోగపడేలా , ఇబ్బందులు కలుగకుండా అభివృద్ధి పనులను నిర్వహించాలని ఆదేశించారు.