నిర్మల్ అర్బన్, అక్టోబర్ 12 : ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం ఏడు విడుతలు విజయవంతమైంది. ఇందులో అన్నివర్గాల ప్రజలను, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంఘాలన్నింటినీ భాగస్వాములను చేస్తూ రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దుతున్నది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు అధికారులు, ప్రజలు కృషి చేస్తే.. మరికొందరు మాత్రం హరితహారాన్ని సామాజికసేవగా తీసుకొని వందల మొక్కలను నాటించడమే కాకుండా వాటి సంరక్షణకు సైతం లక్షలు వెచ్చిస్తూ సేవాదృక్పథాన్ని చాటుకుంటున్నారు. సొంత ఖర్చుతో మొక్కలు కొనుగోలు చేస్తూ, వాటి రక్షణకు ట్రీ గార్డులను ఏర్పాటు చేయిస్తూ అందరి మన్నలను పొందుతూ ప్రభుత్వం నుంచి అవార్డులను అందుకున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం హరితనిధిని ఏర్పాటు చేయడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా పలువురు హరిత ప్రేమికులపై నమస్తే తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం..
పట్టణానికి చెందిన సాయిదీక్ష సేవాసమితి 14సంవత్సరాల క్రితం ఏర్పాటైంది. దాదాపు 20మంది సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతూ పలువురికి భక్తి భావనను, హైందవ సంస్కృతీ సంప్రదాయాలు, మానవతా విలువలను నేర్పుతూ ప్రశంసలు పొందుతున్నది. ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు ప్రజా చైతన్య కార్యక్రమాలను సైతం ఈ సంస్థ సభ్యులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారంలో సైతం ముందుండి హరితస్ఫూర్తిని చాటుతున్నారు. ప్రతి ఇంటికీ మొక్కలను పంపిణీ చేసేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలో సుమారు 20వేల మొక్కలను ప్రజలకు పంపిణీ చేశారు. పట్టణాన్ని హరిత నిర్మల్గా తీర్చిదిద్దేందుకు కృషి చేశారు. ఈ సేవాసమితి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొక్కల పంపిణీ వాహనాన్ని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. మొక్కలను పంపిణీ చేయడమే కాకుండా పాఠశాలలు, దేవాలయాలు, పార్కులు, ఖాళీ ప్రదేశాలు, కార్యాలయాల ఎదుట, జాతీయ రహదారి డివైడర్ల మధ్యలో మొక్కలను నాటి హరితప్రేమను చాటుకున్నారు.
మొక్కల పంపిణీతోపాటు వాటి సంరక్షణ ఎంతో అవసరమని ప్రజలకు వివరించారు. సమితి సభ్యులు నాటిన ప్రతి మొక్కనూ కాపాడాలని కాలనీవాసులకు అవగాహన కల్పించారు. మొక్కల సంరక్షణ లేని ప్రదేశాల్లో రూ.2 లక్షలతో ట్రీగార్డులను కొనుగోలు చేసి వాటికి అమర్చారు. ఇందుకు గాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ జగన్మోహన్ చేతుల మీదుగా సేవాసమితి అధ్యక్షుడు లక్కాడి జగన్మోహన్ రెడ్డి ఉత్తమ సామాజిక సేవా అవార్డు అందుకున్నారు.
జన్మనిచ్చిన అమ్మ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే…తన చిన్నతనంలోనే అమ్మను కోల్పోయిన ఆయన తన తల్లినే తపిస్తూ అనేక సామాజిక సేవాకార్యక్రమాలను చేపడుతున్నాడు. నాటిన మొక్కలో తమ అమ్మను చూసుకోవాలనే ఆలోచనతో హరితహారంలో వెయ్యి మొక్కలను నాటించి హరిత ప్రేమికుడిగా నిలిచి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితోపాటు పలువురి మన్నలను అందుకున్నాడు. జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ కాలనీకి చెందిన ఆధ్యాత్మిక వేత్త, ప్రముఖ బిల్డర్ కొరిపెల్లి దేవేందర్రెడ్డి తన తల్లి కొరిపెల్లి కమలమ్మ జ్ఞాపకార్థం పట్టణంలోని కమలానగర్ కాలనీని దత్తత తీసుకొని హరితహారంలో భాగంగా వెయ్యి మొక్కలను విజయవాడ నుంచి సొంత ఖర్చుతో కొనుగోలు చేశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా కాలనీలో హరితహారాన్ని ఐదేండ్ల క్రితం నిర్వహించారు. ప్రస్తుతం ఆ మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారంలో యువజన, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు సైతం హరిత ప్రేమికులుగా మారారు. జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ కాలనీకి చెందిన పవనసుత యూత్, బంగల్పేట్కు చెందిన ముదిరాజ్ యూత్, శాంతినగర్ కాలనీకి చెందిన వివేకానంద యూత్ సభ్యులతోపాటు పలు సొసైటీల సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు సైతం మొక్కలను నాటి హరితప్రేమను చాటుకుంటున్నారు.