నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 25 : నిర్మల్ పట్టణం లో పిస్తోల్ కలకం రేపింది. స్థానికులను భయాందోళనకు గురి చేసింది. స్థానిక దివ్యానగర్ కాలనీ ఇబ్రహీం చెరువు ప్రాంతంలోని బండరాయిపై పిస్తోల్ కనబడడంతో స్థానికులు డయల్ 100కు సమాచారం అందించారు. వెంటనే రంగంలోని దిగిన పోలీసులు అక్కడే ఉన్న రివాల్వర్, దాదాపు 10 బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డిని వివరాలు కోరగా, అది 9 ఎంఎం సర్వీస్ రివాల్వర్ అని తెలిపారు. దానిని ఎవరికి కేటాయించిందనేది సాయుధ దళ కార్యాలయం నుంచి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. విధుల్లో ఎందుకు నిర్లక్ష్యం వహించారనే విషయంపై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు.
పోలీసు అధికారిపై క్రమ శిక్షణ చర్యలు..
శాంతిభద్రతల పరిరక్షణ, వీఐపీలకు రక్షణగా ఉండేందుకు పోలీసులకు అందించే పిస్తోల్ను నిర్లక్ష్యంగా మర్చిపోవడంతో ఆ పోలీసుపై క్రమ శిక్షణా చర్యలు తీసుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. పిస్తోల్పై ఉన్న కోడ్ ఆధారంగా అది నిర్మల్ ఐడీ పార్టీ, క్యాట్ పార్టీ, ఇతర సిబ్బందికి కేటాయించినదిగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి వివరాలు సేకరించి విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు అతనిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.