నిర్మల్ చైన్గేట్, మార్చి 12: మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించడంతో పాటు సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలనేది ప్రభుత్వ ఆశయం. ఇందుకు పలు ప్రభుత్వ ప్రసూతి దవాఖానల్లో ‘నర్స్ మిడ్ వైఫ్ ఆఫ్ ప్రాక్టీషనర్ సిస్టమ్’ను ప్రారంభించింది. అందుకోసం దవాఖానల్లో సిబ్బందిని నియమించింది. ఇందులో భాగంగా నిర్మల్ ఎంసీహెచ్లో ప్రత్యేక శిక్షణ పొందిన నలుగురిని మిడ్వైఫ్ ప్రాక్టీషనర్లను నియమించారు. వీరు దవాఖానకు వచ్చే గర్భిణులకు సలహాలు ఇస్తూ వారిలో ఉన్న భయాలను తొలగించి సుఖ ప్రసవం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. నిర్మల్ ఎంసీహెచ్లో ప్రతినెలా వందకు పైగా సుఖ ప్రసవాలు జరుగుతున్నాయి. ఇక్కడికి జిల్లా నుంచే కాకుండా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి గర్భిణులు వచ్చి పురుడు పోసుకుంటున్నారు. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మొత్తం 1950 ప్రసవాలు చేయగా.. అందులో 651 సాధారణ కాన్పులున్నాయి. మిగతావి హైరిస్క్, తదితర సమస్యలతో సిజేరియన్ చేశారు.
‘మిడ్ వైఫ్’ అందించే సేవలు..
ప్రతినెలా దవాఖానకు పరీక్షల కోసం వచ్చే గర్భిణులకు సాధారణ ప్రసవంపై అవగాహన కల్పిస్తారు. గర్భిణులు తీసుకునే ఆహారం, ప్రత్యేక వ్యాయామాలపై అవగాహన కల్పిస్తారు. హైరిస్క్ ఉన్న గర్భిణులను ముందుగానే గుర్తిస్తారు. సాధారణ ప్రసవం చేసుకునేలా చైతన్యం కల్పిస్తారు. వారిలో ఉన్న భయాందోళనలు, అపోహలను తొలగిస్తారు. నొప్పులతో బాధపడుతున్న గర్భిణులకు ఉపశమనం కల్పిస్తారు. నాలుగు రకాల సాధారణ పద్ధతుల ద్వారా పురుడు పోస్తారు.
సాధారణ ప్రసవంతో అధిక ప్రయోజనాలు
సాధారణ ప్రసవంతో అధిక ప్రయోజనాలున్నాయి. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. నిర్మల్ ఎంసీహెచ్లో శిక్షణ పొందిన మిడ్వైఫ్ సహాయకులున్నారు. దవాఖానలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు సాధారణ ప్రసవాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దవాఖానలో సిజేరియన్ల సంఖ్య తగ్గింది. దవాఖానలో అన్ని సౌకర్యాలున్నాయి. ప్రజలు సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ రజని, ఆర్ఎంవో, ఎంసీహెచ్, నిర్మల్
అవగాహన కల్పించారు.
ప్రతినెలా దవాఖానకు పరీక్షలకు వచ్చినప్పుడు మిడ్వైఫ్ సహాయకులు అవగాహన కల్పించారు. సాధారణ ప్రసవం చేసుకుంటే కలిగే లాభాలపై వివరించారు. నాకు సుఖ ప్రసవం చేశారు. చాలా సంతోషంగా ఉంది. దవాఖానకు వచ్చే గర్భిణులకు వ్యాయామం, నిత్యం తీసుకునే ఆహారంపై సహాయకులు వివరించారు. వైద్యశాలలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలో నిపుణులైన వైద్యులు సేవలందిస్తున్నారు.
– మనీషా, బాలింత, కంజర్