నిధుల ఖర్చుపై జీపీలకే అధికారం
గతంలో జారీ చేసిన జీవో 91 రద్దు
గ్రామసభ ఆమోదం తప్పనిసరి
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న సర్పంచ్లు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,508 గ్రామ పంచాయతీలకు వర్తింపు
సారంగాపూర్/సోన్ మార్చి 29 : గ్రామపంచాయతీలు మరింత పవర్ఫుల్గా మారాయి. నిధుల వినియోగంలో ఉన్న ఇక్కట్లు తొలగిపోయాయి. అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేసే విషయంలో అధికారుల అనుమతి ఇకనుంచి అక్కర్లేదు. పంచాయతీల పాలకవర్గాలకే అధికారాన్ని కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీల్లో నిధుల వినియోగానికి సంబంధించి గతంలో కొన్ని పరిమితులు ఉండేవి. వీటికి సంబంధించి గతంలో జారీ చేసిన జీవో నం.91ని ప్రభుత్వం రద్దు చేసింది. పంచాయతీలకు మంజూరైన నిధుల వినియోగంలో గ్రామసభ ఆమోదాన్ని తప్పనిసరి చేస్తూ సీఎం కేసీఆర్ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,508 గ్రామపంచాయతీలుండగా.. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం అన్ని గ్రామపంచాయతీలకూ వర్తించనుంది.
పరిమితుల సడలింపు…
జీవో నం.91 ప్రకారం ఆయా పంచాయతీల్లో సివిల్వర్క్స్ కోసం మేజ ర్ పంచాయతీలు రూ.2 లక్షల వరకు, చిన్న పంచాయతీలు రూ.లక్ష వరకు ఖర్చు చేయడానికి అనుమతి ఉండేది. అంతకు మించి నిధులు ఖర్చు చేయాలంటే (రూ.3లక్షల వరకైతే) జిల్లా పంచాయతీ అధికారి, ఆపై నిధుల వినియోగానికి సంబంధించి కలెక్టర్ అనుతులు తప్పనిసరి గా తీసుకోవాల్సి వచ్చేది. ఈ క్రమంలో అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుందనే భావనతో ప్రభుత్వం తాజాగా పరిమితులను సడలించింది.
సీఎం హామీ మేరకు..
పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న 15వ ఆర్థిక సంఘం (స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్..ఎస్ఎఫ్సీ) నిధుల వినియోగం విషయంలో పరిమితులు ఉండేవి. దీంతో ఎక్కువ నిధుల ఖర్చు కోసం అనుమతి పొందడానికి అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. జిల్లా పంచాయతీ అధికారి, కలెక్టర్ అనుమతి రావాలంటే ఎక్కువ రోజుల సమయం పడుతుండడంతో ప్రభుత్వం నిధుల వినియోగంలో పరిమితులను ఎత్తివేయాలని నిర్ణయించింది. ఇకనుంచి నిధుల వినియోగానికి సంబంధించి గ్రామసభ ఆమోదం పొందితే సరిపోతుందని సర్కారు తాజాగా వెల్లడించింది. పంచాయతీల నిధుల విషయంలో గ్రామపంచాయతీలకే పెత్తనం కల్పిస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆ ప్రకటన మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల వినియోగంలో పంచాయతీలకు స్వేచ్ఛను కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జిల్లాలోని సర్పంచ్లు స్వాగతిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
యాదాద్రి జిల్లాలో మూడు రోజుల్లో 66 మందికి పాజిటివ్
ఎస్యూవీలకు ఫుల్ క్రేజీ.. ధరలు కూడా ఎక్కువే..