నెన్నెల, మార్చి16: చిత్తాపూర్ గ్రామం అంటే మామిడి పండ్లకు ప్రసిద్ధి. అడుగడుగునా మామిడి చెట్లే కనిపిస్తుంటాయి. వందలాది ఎకరాల్లో వివిధ రకాల మామిడి కాయలు ఇక్కడ సాగవుతూ ఉంటాయి. కానీ గ్రామంలో మాత్రం ఒక్క పచ్చని మొక్క కనిపించేది కాదు. గ్రామంలో ఎవరైనా కాలం చేస్తే వారి దహన సంస్కారాలు చేయడానికి కిలోమీటర్ల కొద్దీ నడిచి అడవికి తీసుకపోవాల్సిన పరిస్థితి ఉండేది. గంటల తరబడి శవయాత్ర జరిగేది. పాడె మోసేవారు వానకాలంలో నరక యాతన పడేవారు. గ్రామంలో చావు కేక వినబడితేచాలు.. ముందస్తుగా దహనం ఎక్కడా అని ఆరాతీసేవారు. చేన్లు, తోటలున్న వారు వారి వారి స్థలాల్లో అంతిమ సంస్కారాలు చేసుకునేవారు. భూమి లేని నిరుపేదలు, కూలీలు మాత్రం మూడడుగుల స్థలం కోసం నానా అవస్థలు పడేవారు. ఇక గ్రామంలో ఎక్కడ చూసినా పచ్చని చెట్టు అనేది కనబడేది కాదు. దాదాపు 800 ఎకరాలకు పైగా మామిడి తోటలు దట్టమైన అడవిలా ఉంటాయి. కానీ ఇతర చెట్లు మాత్రం కనబడేవి కావు.. ఇదంతా గతం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామ రూపురేఖల్ని మార్చేసింది. ఊరంతా పచ్చలహారంలా తయారైంది. ఆఖరి మజిలీ చింత తీరింది. వైకుంఠధామం ఏర్పాటు చేశారు. దానికి పక్కా రోడ్డు వేశారు. ఇరువైపులా హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఐదు విడుత లుగా చేపట్టిన హరితహారంతో గ్రామంలో ఎక్కడ చూసినా నాటిన ప్రతి మొక్క చెట్టులా ఎదుగుతూ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రతి రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు నీటి వసతిని కల్పిస్తుండడం తో అవి పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. ఇక గ్రామ పంచాయతీ వద్దకు పోతే పూల మొక్కలు, నీడ నిచ్చే పచ్చని చెట్లు ఆకర్షిస్తున్నాయి. పల్లె ప్రకృతి వనం పిల్లలకు మంచి ప్రశాంతతను కలిగిస్తున్నది.. ఇదంతా వర్తమానం. చిత్తాపూర్ గ్రామం ఒకప్పుడు అభివృద్ధికి ఆమడదూరం ఉండేది. మామిడి తోటలు తప్ప మరే చెట్టూకనిపించేది కాదు. గ్రామంలో ఎవరైనా చనిపోతే అడవికి తీసుకెళ్లి దహన సంస్కారాలు చేసేవారు. మృతదేహాన్ని తీసుకుపోయేం దుకు బంధువులు నరకయాతన పడే వారు. వర్షాకాలంలో నైతే శవజాగరణ తప్పేది కాదు. ఇప్పుడా కష్టాలకు కాలంతీరింది. ప్రత్యేకంగా ఎకరం స్థలంలో వైకుంఠధామం నిర్మించారు. అందులో దహన వాటిక, స్నానాల గది, మోటర్, వెయిటింగ్ హాలు, బాత్ రూంలు ఏర్పాటు చేశారు. వైకుంఠధామానికి పోవడానికి రోడ్డు సౌకర్యం, దానికి ఇరువైపులా మొక్కలు నాటారు.
పల్లె ప్రగతిలో భాగంగా చిత్తాపూర్లో 20 గుంటల స్థలంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. అందులో దాదాపు రెండు వేల వివిధ రకాల మొక్కలు నాటారు. పూలు, పండ్లు, కొబ్బరి మొక్కలతో పాటు నీడనిచ్చే మొక్కలు నాటారు. అందులో నడిచేందుకు ప్రత్యేకంగా ఎర్రమట్టితో కూడిన వాకింగ్ ట్రాక్ను నిర్మించారు. సేద తీరడానికి సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. పల్లె ప్రకృతి వనం పక్కనే రైతు వేదిక, దాని పక్కనే పాఠశాల, గిరిజన ఆశ్రమ పాఠశాలు ఉండడంతో నిత్యం విద్యార్థులు, రైతులు వనంలోకి వస్తున్నారు.
హరితహారంలో భాగంగా ఇప్పటివరకు నాలుగు వేల మొక్కలు నాటారు. రోడ్లకు ఇరువైపులా, పాఠశాలలు, గ్రామ పంచాయతీ, శ్మశాన వాటిక, అంగన్వాడీ కేంద్రాల వద్ద నాటారు. వాటి సంరక్షణ బాధ్యతను సర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యులు తీసుకున్నారు. పాఠశాల వద్ద ఉపాధ్యాయులు, విద్యార్థులు, అంగన్వాడీ కేంద్రాల వద్ద టీచర్లు, రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలను ఆయా వార్డు సభ్యులు సంరక్షిస్తున్నారు.