నిర్మల్ టౌన్, మే 11 : కరోనా కట్టడికి ప్రభుత్వం పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటా జ్వర సర్వే నిర్వహిస్తూ.. ఇంటికే మందులు పంపిణీ చేస్తూ క్షేత్రస్థాయిలోనే కట్టడికి చర్యలు తీసుకుంటున్నది. దీంతో పాటు ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయడం.. ఆక్సిజన్ కొరత లేకుండా చూడ డం.. కొవిడ్ కేర్ కేంద్రాలు ఏర్పాటు చేసి రోగుల బాగోగులు చూడడం.. ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి కావాల్సిన సూచనలు, సలహాలు ఇవ్వడం వంటివి చేస్తున్నాయి. అయినా.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ అస్ర్తాన్ని ప్రయోగించింది. పది రోజులపాటు కొనసాగే లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయడానికి అధికారగణం రంగంలోకి దిగింది. నేడు (బుధవారం) ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి వస్తున్ను నేపథ్యంలో.. ఆయా శాఖల అధికారులు చేపట్టాల్సిన అంశాలు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తీసుకోవాల్సిన చర్యలు, మినహాయింపు సంస్థలు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన పాసులు, ధాన్యం కొనుగోళ్ల వంటి అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఇదే సమయంలో.. నిత్యావసర సరుకుల కొరత లేకుండా చూడాలని పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. నిబంధలకు విరుద్ధంగా వ్యవహరించినా.. వెంటనే కేసులు నమోదు చేయాలని కూడా ఆయా శాఖలకు ఆదేశాలు వెళ్లాయి.
ఆగం కావద్దు..
లాక్డౌన్ అన్న విషయం బయటకు రాగానే.. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైన్స్షాపుల ముందు మందుబాబులు బారులుదీరారు. నిత్యం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు వైన్షాపులు తెరిచి ఉంటాయని ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా.. మద్యం ప్రియులు మాత్రం ఆగం అవుతున్నారు. కొంత మంది నిత్యావసర సరకుల కోసం పరుగులు పెడుతున్నారు. షాపింగ్మాల్స్, హోల్సెల్, రిటైల్ దుకాణాల వద్దకు వెళ్లి పెద్ద మొత్తంలో నిత్యావసర సరకులు కొనుగోలు చేశారు. ప్రతిరోజూ అన్ని రకాల దుకాణాలు తెరిచి ఉంటాయని, అధికారులు ప్రభుత్వం పదేపదే చెప్పినా కొంత మంది వినకుండా చేస్తున్న ఈ కొనుగోళ్ల వల్ల తాత్కాలికంగా సరకుల కొరత ఏర్పడే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గతేడాది 68 రోజులపాటు లాక్డౌన్ ఉన్నా.. ఏ నిత్యావసర సరుకుల కొరత రాకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని, ఈసారి కూడా ఎక్కడా ఏ కొరత రాదని అధికారులు పేర్కొంటున్నారు. పక్క రాష్ర్టాలన్నీ లాక్డౌన్ విధించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా సముచిత నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది..
ముఖ్యమంత్రి ఏ విషయంలోనైనా సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే రెండో దశ కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా మంది ఉద్యోగులు కొవిడ్ బారిన పడి హోం క్వారంటైన్ లో ఉన్నారు. లాక్డౌన్ లేకపోతే ఉపాధిహామీ పనులతో పాటు బ్యాంకుల్లో రుణాల పంపిణీలో ఎక్కువగా జనం గుమిగూ డడం వల్ల జిల్లా అధికారులమంతా ఇబ్బందులకు గుర య్యాం. లాక్డౌన్ వల్ల ఉధృతి తగ్గుతుందని భావిస్తున్నాం. లాక్డౌన్ సమయంలో పౌరుల కు ఏ సహాయం కావాలన్న అధికారులుగా చేసి పెట్టేందుకు కృతనిశ్చయంతో పని చేస్తాం.
-వెంకటేశ్వర్లు, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు
ఉపశమనం కలిగించింది..
20 ఏళ్ల నుంచి డ్రైవర్గా పని చేస్తున్నా. ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు చూడలేదు. ముక్కుకు, మూతికి మాస్క్ పెట్టి బస్సు నడిపితే చాలా ఇబ్బందికి గురవుతున్నాం. కానీ వైరస్ కారణంగా ఆరోగ్యానికి అదే రక్ష కావడంతో మాస్క్లు పెట్టి ప్రతిరోజు బస్సులు నడిపి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఈనెల 12 నుంచి 25 వరకు లాక్డౌన్ విధించడంతో బస్సులు కూడా బంద్ కానున్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రజా సేవ చేస్తున్న మాసేవలకు తాత్కాలికంగా ప్రభుత్వం ఉపశమనం కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది.
ఫయీంఖాన్, ఆర్టీసీ డ్రైవర్, భైంసా డిపో