దస్తురాబాద్ : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యా అధికారి ఏ.రవీందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాలను, కస్తూర్బా గాంధీ పాఠశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల పరిసరాలను, వంట గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. పాఠాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఉపాధ్యాయుడు ఇద్దరు విద్యార్థులను దత్తతను తీసుకోవాలని, విద్యార్థుల నుంచి వారి నైపుణ్యాన్ని వెలికి తీయాలని ఉపాధ్యాయులకు సూచించారు. 10వ తరగతి విద్యార్థులకు 10 జీపీఏ వచ్చే విధంగా కృషి చేయాలని, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులలో బోధించాలని వెల్లడించారు. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలని అన్నారు.
విద్యార్థులకు ఒత్తిడి లేకుండా అర్థం చేసుకునే విధంగా బోధించాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలలకు ఎక్కువ సంఖ్యలో వచ్చే విధంగా చూడాలని అన్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు బోధించాలని, అన్ని విధాలుగా ప్రభుత్వ పాఠశాలలో మార్పు కన్పించే విధంగా ఉపాధ్యాయులు విధులు నిర్వహించాలని కోరారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయుడు ఈశ్వర్, ఉపాధ్యాయులు వెంకటరమణ, కోటేశ్వరావు, నవీన్, సుగుణకర్, విజయలక్ష్మి, ఫరినా, సీఆర్టీలు సులోచన, లావణ్య, మందాకిని, గౌతమి, నర్మద, రాధిక తదితరులున్నారు.