నిర్మల్ : నిర్మల్ పట్టణ కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర గార్డెన్స్ లో లీడ్ బ్యాంక్, ఎస్బీఐ ఆధ్వర్యంలో సమగ్ర రుణ విస్తరణ కింద నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మల్ జిల్లాలోని మహిళా సంఘాలకు 14 బ్యాంకుల ద్వారా రూ. 29 కోట్ల 76 లక్షల 55 వేల రుణాలు అందజేశారు.
మున్సిపల్ ప్రాంతంలోని మెప్మా కింద 68 మహిళా సంఘాలకు రూ.4 కోట్ల 59 లక్షలు, 542 గ్రామీణ ప్రాంతాల స్వయం సంఘాలకు 25 కోట్ల 17 లక్షల 55 వేల రుణాల చెక్కులను కలెక్టర్ అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు పొంది యువత, మహిళా సంఘాలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి అభివృద్ధి చెందాలని కోరారు. దీంతో జిల్లా ఆర్థికాభివృద్ధి తద్వారా రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతాయని తెలిపారు. లబ్ధిదారులు కష్టపడి పని చేసి లాభాలు పొంది, సకాలంలో తిరిగి రుణాలు చెల్లించాలని ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని కోరారు.
ఈ రుణమేళాలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఎస్బీఐ, యూబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఇండియ బ్యాంక్, ఆదిలాబాద్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు, ఐవోబీ, హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు పాల్గొన్నాయి.
కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం పి.కె. మోహన్ దాస్, యూనియన్ బ్యాంక్, ఏ.జి.యం. సుందర్ కృష్ణ, ఎ.డి.సి.సి. బ్యాంక్ ఎ.జి.యం మురళీధర్రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ యన్. హరికృష్ణ, మెప్మా పి.వో. సుభాష్, డీఆర్డీవో ఎ.పి.డి. గోవింద్ రావు, బ్యాంకు అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.