నిర్మల్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో రోగనిర్ధారణ పరీక్షా సెంటర్
ఐదు నెలల్లో 5138 శాంపిల్స్.. 53,009 పరీక్షలు..
రోజుకు 400 దాకా టెస్టులు
పేదలపై తగ్గిన ఆర్థిక భారం
నిర్మల్ చైన్గేట్, జూలై 25 : రోగమస్తే పేద ప్రజలు ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితి. ప్రభుత్వ దవాఖానల్లో ఇంతకుముందు సాధారణ పరీక్షలు మాత్రమే చేసేవారు. ఇతర పరీక్షలకు ప్రైవేట్ ల్యాబ్లకు పంపేవారు. దీంతో పేదలకు ఖర్చు తడిసిమోపెడయ్యేది. ఆర్థిక భారంతో చికిత్స చేసుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతుండేవారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ల్యాబ్ల దోపిడీకి అడ్డుకట్ట వేసింది. కోట్లాది రూపాయలు వెచ్చించి ఉచితంగా 57 రకాల పరీక్షలు చేసేందుకు నిర్మల్ జిల్లా ప్రధాన దవాఖానలో ఆధునిక యంత్రాలతో కూడిన రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రం (టీహబ్) ఏర్పాటు చేశారు. నెల రోజుల క్రితం పరీక్షా కేంద్రం ప్రారంభించారు. ఈ ఉచిత పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగంగా మారింది.
చేసే పరీక్షలు ఇవే..
రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రంలో థైరాయిడ్, మధుమేహం, హార్మోన్, సీబీపీ, టైఫాయిడ్, మలేరియా, డెంగీ వంటి 57 రకాల పరీక్షలు చేస్తారు. నిర్మల్లో ప్రస్తుతం 42 రకాల పరీక్షల వరకు చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి జూలై 24 వరకు 2489 మంది రోగుల నుంచి 5138 శాంపిల్స్ సేకరించారు. 53,009 వివిధ రకాల పరీక్షలు చేశారు.
ఆరోగ్య కేంద్రాల్లో నమూనాల సేకరణ..
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్త నమూనాలు సేకరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 27 ఆరోగ్య కేంద్రాల్లో నమూనాలు సేకరించి రోగనిర్ధారణ కేంద్రానికి పంపిస్తారు. జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలతో పాటు నిజామాబాద్ జిల్లాలోని మెండోరా, ఎస్సారెస్పీ, ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ ఆరోగ్య కేంద్రాల నుంచి నమూనాలు సేకరించి ఇక్కడికి పంపిస్తున్నారు. తీసుకున్న శాంపిళ్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆయా ఆరోగ్య కేంద్రాల నుంచి శాంపిళ్లను తీసుకురావడానికి ఐదు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల పరీక్షా కేంద్రానికి తీసుకొస్తారు. పరీక్షా కేంద్రంలో నిత్యం రెండు వేలకుపైగా నమూనాలు పరీక్షించే సామర్థ్యం ఉన్నా.. రోజుకు 400 వరకు పరీక్షలు చేస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి..
ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రైవేట్లో వేలాది రూపాయలు వెచ్చించి పరీక్షలు చేయించుకొని ఆర్థికంగా నష్టపోవద్దు. ఆరోగ్య కేంద్రాల్లో రక్త నమూనాలు ఇస్తే ఉచితంగా పరీక్షలు చేస్తాం. పరీక్షల ఫలితాలను బట్టి వైద్యులు చికిత్సలు చేస్తారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఆధునిక యంత్రాలతో సత్వరమే ఫలితాలు అందిస్తున్నాం. రోగులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం.