మంత్రి అల్లోల, డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి
విజయ డెయిరీ ద్వారా నీటి బాటిళ్ల పంపిణీ
నిర్మల్ టౌన్, జూలై 24 : జిల్లాలో రెండు, మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు విజయ డెయిరీ ద్వారా చేయూతనందిస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో విజయ డెయిరీ ద్వారా శనివారం వరద బాధితులకు నీటి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మల్ మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున నీటి బాటిళ్లను అందించినట్లు తెలిపారు. విజయ డెయిరీ పాలతో పాటు నీటి బాటిళ్లు ప్రజల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. విజయ డెయిరీ ద్వారా 1.50 లక్షల పాల ప్యాకెట్లు, నీటి ప్యాకెట్లను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, విజయ డెయిరీ డీడీ మధుసూదన్, నిర్మల్ నిర్వాహకుడు రమణారెడ్డి పాల్గొన్నారు.