మిషన్ భగీరథ ద్వారా అందరికీ గోదావరి జలాలు
పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ఏడు ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణానికి చర్యలు
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
పాల్వంచ, జూలై 13: పాల్వంచ మున్సిపాలిటీలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మిషన్ భగీరథ ద్వారా ఏప్రిల్ నాటికి ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇస్తామని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పాత పాల్వంచలోని తన స్వగృహంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.61 కోట్లతో మిషన్ భగీరథ పథకం కింద మున్సిపాలిటీ పరిధిలోని పాత పాల్వంచ, గుడిపాడు, మైనింగ్ కాలేజీ, శేఖరం బంజర, వెంగళరావు కాలనీ, ఇందిరాకాలనీ, కరకవాగు ప్రాంతాల్లో ఏడు ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే ఆయా వాటర్ట్యాంకుల నుంచి అనుసంధానంగా 160 కిలో మీటర్ల మేర కొత్త పైపులైన్ నిర్మాణానికి చర్యలు చేపట్టామని, ఈ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 22 వేల ఇళ్లకు మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికీ కొత్త కనెక్షన్ ఇచ్చి తాగునీటి సమస్య అనేది తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు చెప్పారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథను ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటి వరకూ మంచినీటి సౌకర్యం లేని శేఖరం బంజర, తెలంగాణ నగర్, శ్రీనివాసకాలనీ, ఎర్రగుంట, బిక్కుతండా, సోనియా నగర్, రాజీవ్నగర్, నవభారత్ ప్రాంతాలకు కూడా మిషన్ భగీరథ నీటిని అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేందర్రావు, చింతా నాగరాజు, ఏనుగుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.