నల్లగొండ : నకిలీ పత్తి విత్తనాలతో రైతులను మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మూడు టన్నుల బిజీ-3 విత్తనాలను సీజ్ చేసినట్లు నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ నర్మద తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులతో కలిసి నర్మద మీడియా సమావేశం నిర్వహించారు. ముఠా సభ్యుల నకిలీ విత్తనాల దందాకు సంబందించిన వివరాలను వెల్లడించారు.
సమాచారం మేరకు గడిచిన మూడు నెలలుగా ఈ నకిలీ దందా విషయంలో లోతుగా విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఎస్పీ ఏ.వి. రంగనాధ్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐలు బాలగోపాల్, ఎస్.ఎమ్. బాషా, చండూర్ సీఐ సురేష్ కుమార్, నల్లగొండ వన్ టౌన్ సీఐ ఎన్.సురేష్, ఎస్ఐ కె. నరేష్, మరో ఎస్ఐ హెచ్.నరేష్ తదితరుల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ , పోలీస్ బృందాలు, ఇతర పోలీసుల సహకారంతో నకిలీ విత్తనాల దందా మొత్తం వ్యవహారాన్ని బహిర్గతపరిచినట్లు తెలిపారు.
బీజీ-3 నకిలీ విత్తనాలను కావ్య, అరుణోదయ, రాఘవ-9, బిల్లా, పావని, శ్రీ సత్య సీడ్స్, రెయిన్బో సీడ్ నకిలీ కంపెనీల పేర్లతో కవర్స్ తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఇందులో మొత్తము 15 మంది నేరస్థులు ఉండగా నలుగురు నేరస్థులు A1-మన్నెం లక్ష్మీనారాయణ, A6-గుమ్మరాల వెంకటేశ్వర్లు, A9- బఖిరెడ్డి శివ భూషణ్ రెడ్డి, A-13 వెంకట్ రావు లు ఇది వరకే అరెస్ట్ అయ్యారని శుక్రవారం మరో ఆరుగురు నేరస్థులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారన్నారు.