విప్లవ నాయకిగా తమిళ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘తలైవి’. కంగనారనౌత్ టైటిల్ రోల్ని పోషిస్తోంది. ఏ.ఎల్.విజయ్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాలోని కొత్త పోస్టర్స్ను గురువారం విడుదల చేశారు. సినీ నటిగా ప్రస్థానాన్ని ఆరంభించిన జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగిన వైనాన్ని..ఆమె జీవితంలోని ముఖ్యఘట్టాల్ని, సంఘర్షణను ఆవిష్కరిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. జయలలిత జీవితంలోని నాలుగు కీలక దశల్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. గతంలో విడుదలైన చిత్ర పోస్టర్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ఎంజీఆర్గా అరవింద్స్వామి నటించారు. ఏప్రిల్ 23న విడుదలకావల్సిన ఈ చిత్రాన్ని కరోనా సెకండ్వేవ్ కారణంగా వాయిదా వేశారు. ఆగస్ట్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.