బడంగ్పేట/మహేశ్వరం, జూన్ 25 : జూలై 1 నుంచి ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుసీంద్రరావు ప్రధానో పాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని తుక్కుగూడ, కొంగర రావిర్యాల, నాదర్గుల్, జిల్లెలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలను ఎంఈఓ కృష్ణయ్యతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. జూలై 1న ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను పాటిస్త్తూ పాఠశాలలను నడిపించాల్సిన బాధ్యత ప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయుల పై ఉందన్నారు. పాఠశాలలోని తరగతి గదులను శానిటైజేషన్ తప్పకుండా చేయాలన్నారు. భౌతిక దూరం పాటిస్త్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పని సరిగా మాస్కులు ధరించాలన్నారు. అదేవిధంగా 8,9,10 తరగతుల విద్యార్థులు పాఠశాలలకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలన్నారు. ప్రత్యేక తరగతుల తోపాటు ఆన్లైన్ తరగతులు ఉంటాయన్నారు. ఎలాంటి సర్టిఫికెట్ లేకున్నా పై తరగతులకు అడ్మిషన్ తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తుక్కగూడ మున్సిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్, వైస్ చైర్మన్ భవానీ వెంకట్రెడ్డి, తదితరులు ఉన్నారు.