అలంపూర్, జూన్ 19 : గ్రామాల్లోని సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని డీఆర్డీవో, మండల ప్రత్యేక అధికారి ఉమాదేవి తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సుగుణకుమార్ అధ్యక్షతన మొదటి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను శాఖల వారీగా వివరించారు. గ్రామాల్లో చేపట్టవలసిన, పూర్తి కాని పనులను ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఉమాదేవి మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను ఎప్పటివరకు పరిష్కరిస్తారో ప్రజాప్రతినిధులకు అధికారులు వివరించాలని సూచించారు. గడువులోగా సమస్యలు పరిష్కరించకుంటే తాను ఆయా గ్రామాలను సందర్శించి న్యాయం చేస్తానన్నారు. నాయబ్ తాసీల్దార్ విజయరాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. ఏవో అనిత మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమాకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. సింగవరం సర్పంచ్ రాంప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని కోరారు. ఏపీవో శరత్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద రైతులు పంట నూర్పిడి కల్లాలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. పంచాయతీ రాజ్ ఏఈ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీలోగా సెగ్రిగేషన్ షెడ్డు, వైకుంఠధామం పనులకు సంబంధించి ఎంబీలు చేయించుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎంపీవో చంద్రకళ ప్రజాప్రతినిదులకు సూచించారు. మండల వైద్యాదికారి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అందరూ కొవిడ్ టీకా వేయించుకోవాలన్నారు. ఎంపీడీవో మాట్లాడుతూ హరితహారానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో విజయ నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.