కేపీహెచ్బీ కాలనీ, జూన్ 18 : యూ ట్యూబ్ పరిజ్ఞానంతో దొంగనోట్లను తయారీ చేసి పలుమార్లు పోలీసులకు చిక్కినా.. తనబుద్ధి మార్చుకోకుండా మళ్లీ అదే తరహాలో దొంగనోట్లను ముద్రించి చలామణి చేస్తున్న వ్యక్తిని కేపీహెచ్బీ కాలనీ పోలీసులు అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. అతడి వద్ద నుంచి 14 నకిలీ 2వేల రూపాయల నోట్లను, జిరాక్స్ మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సైబరాబాద్ డీసీపీ వెంకటేశ్వర్లు, కూకట్పల్లి ఏసీపీ సురేందర్రావు, కేపీహెచ్బీ కాలనీ సీఐ లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం(వి) ప్రాంతానికి చెందిన ఉప్ప రి రాజుప్రసాద్(28) పదో తరగతి పూర్తి చేశాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు జేపీ కాలనీలో నివాసముంటూ బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్నాడు. సులభం గా డబ్బులు సంపాదించాలన్న ఆశతో.. యూ ట్యూబ్ దొంగనోట్ల తయారీ విధానాన్ని నేర్చుకున్నాడు.
గతం లో లాప్టాప్తో కలర్ జిరాక్స్ మిషన్ను ఉపయోగించి కరపత్రాలను తయారు చేసే విధానంపై ఇతడికి పరిజ్ఞానం ఉంది. దీంతో 2016లో దొంగనోట్లను తయారు చేసి చలామణి చేస్తుండగా పోలీసులకు చిక్కాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పోలీస్ స్టేషన్లో, కృష్ణా జిల్లా మండవల్లి పోలీస్ స్టేషన్లో, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరి వన్టౌన్ పోలీస్ స్టేషన్లో, బాచుపల్లి పోలీస్ స్టేషన్లో, సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో దొంగనోట్ల చలామణి కేసులో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. అయినా.. తీరు మార్చుకోకుండా ఆరోసారి రూ.2 వేల నోట్లను ముద్రించి చలామణిని ప్రారంభించారు. ఈ క్రమంలో రూ.2వేల నోటుతో ఇస్నాపూర్లో చెప్పులు కొనుగోలు చేశాడు. ఈనెల 17న సాయంత్రం 5 గంటలకు కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్లోని ఓ హోటల్ సమీపంలో నకిలీ దొంగనోటును చలామణి చేసే క్రమంలో కేపీహెచ్బీ కాలనీ పోలీసులకు చిక్కాడు. అతడి వద్ద నుంచి 14 నకిలీ 2వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు జిరాక్స్ మిషన్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.